ప్రాణం తీసిన సెల్ఫీ : గోవాలో జగ్గయ్యపేట డాక్టర్ మృతి
గోవా బీచ్లో విషాదం నెలకొంది. సముద్ర అలలు ఓ వైద్యురాలిని బలి తీసుకున్నాయి. బీచ్లో మే 14వ తేదీ రాత్రి సముద్రం వద్ద సెల్ఫీ తీసుకుంటున్న జగ్గయ్యపేటకు చెందిన యువ వైద్యురాలు రమ్యకృష్ణ (26) అలల్లో కొట్టుకపోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈమె గోవా ప్రభుత్వ అనుబంధ వైద్యశాలలో పనిచేస్తోంది. సముద్రంలో రమ్యకృష్ణ గల్లంతైన విషయం మే 15వ తేదీ బుధవారం తెలియడంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రమ్యకృష్ణ గోవాలోని ప్రభుత్వ అనుబంధ వైద్యశాలలో పనిచేస్తోంది. స్నేహితులతో కలిసి మే 14వ తేదీ మంగళవారం రాత్రి గోవాలోని సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ రమ్యకృష్ణ సెల్ఫీ తీసుకొంటోంది. అలల తాకిడికి ఆమె కొట్టుకపోయింది. గుంటూరులోని కాటూరు వైద్య కళాశాల నుంచి మూడేళ్ల కిందట MBBS పట్టా పొందాక, జగ్గయ్యపేటలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో సేవలందించింది రమ్యకృష్ణ. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.