CV Anand : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. పక్కా ప్లాన్ ప్రకారమే అత్యాచారం, అసలేం జరిగిందంటే..

ఆ రోజు అసలేం జరిగింది? నిందితులు బాలికను ఏ విధంగా ట్రాప్ చేశారు? ఈ కేసులో నిందితులకు పడే శిక్షలు ఏంటి? (CV Anand)

CV Anand : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. పక్కా ప్లాన్ ప్రకారమే అత్యాచారం, అసలేం జరిగిందంటే..

Cv Anand

CV Anand : హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక‌పై అత్యాచారం ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నిందితుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు కూడా ఉన్నారనే ఆరోపణలు రావడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. విపక్షాలు ప్రభుత్వాన్ని, పోలీసులను టార్గెట్ చేశాయి. నిందితులను తప్పించే కుట్ర జరుగుతోందని విపక్షాలు ఆరోపించాయి.

అత్యాచారం కేసు వివరాలను హైద‌రాబాద్ పోలీస్ కమిష‌న‌ర్ సీవీ ఆనంద్ మంగ‌ళ‌వారం రాత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ రోజు అసలేం జరిగింది? నిందితులు బాలికను ఏ విధంగా ట్రాప్ చేశారు? ఈ కేసులో నిందితులకు పడే శిక్షలు ఏంటి? వీటి గురించి సీవీ ఆనంద్ కీలక వివరాలు తెలిపారు. ఈ కేసులో చాలా లోతుగా దర్యాప్తు చేశామని, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని, ఆరుగురు నిందితుల్లో ఒకడు మాత్రమే మేజర్ అని, మిగతా అందరూ మైనర్లే అని సీవీ ఆనంద్ చెప్పారు.

మార్చ్ 28న ఇదంతా మొదలైంది. బెంగళూరులో నివసించే ఒక మైనర్ అబ్బాయి హైదరాబాద్‌లో పార్టీ ఇవ్వడానికి ఇక్కడి ముగ్గురు మిత్రులను సంప్రదించాడు. దాంతో వారు ఇన్సోమ్నియా పబ్‌ను సూచించారు. ఆ తర్వాత ‘యూఫోరియా కమింగ్ సూన్’ అని ఆ బెంగళూరు అబ్బాయి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వేరే మిత్రుల ద్వారా పబ్‌ నిర్వాహకులను సంప్రదించగా వారు ఒక్కొక్కరికి రూ. 1300 ధర చెప్పారు. రూ. 900 చొప్పున బేరమాడుకుని పార్టీ నిర్వహించేందుకు బుక్ చేసుకున్నారు.(CV Anand)

Rape On Girl : జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్‌ కేసు..రోడ్లపై తిప్పుతూ కారులోనే బాలికపై ఐదుగురు అత్యాచారం

ఆ తర్వాత ‘మే 28న పార్టీ’ అని బాలుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా 100 మందికి పైగా రెస్పాండ్ అయ్యారు. వారందరి నుంచి రూ. 1200, రూ.1300 వసూలు చేసి పబ్‌కు మాత్రం రూ.900 ధర చొప్పునే చెల్లించాడు బెంగళూరు అబ్బాయి. బాధితురాలు కూడా రూ.1,300 క‌ట్టి మ‌రీ పార్టీకి హాజ‌రైంది. మే 28న మధ్యాహ్నం ప‌బ్‌లో పార్టీ మొద‌లైంది. అదే రోజు నేరం జరిగింది. అయితే, మే 31 సాయంత్రం వరకు ఆమె తన తల్లిదండ్రులకు విషయం చెప్పలేదు. ఆమె ఒంటిపై గాయాలు చూసి తల్లిదండ్రులు అడిగినా ఆమె ఏమీ చెప్పలేదు.

31 రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. బాలిక వివరాలు చెప్పకపోవడంతో భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ ఆమె వివరాలు వెల్లడించింది. ఆ తర్వాత ఆమెను నీలోఫర్ ఆసుపత్రికి పంపించి వైద్య పరీక్షలు చేశారు. మే 3 రాత్రి 9 గంటలకు సాదుద్దీన్ మాలిక్‌ను అరెస్ట్ చేశాం. ఇతను మేజర్. ఆ తర్వాత ఇందులో నిందితులైన మిగతా మైనర్లను అదుపులోకి తీసుకున్నాం. అనంతరం అన్ని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించి, బాధిత బాలిక స్టేట్ మెంట్‌తోనూ పోల్చి సరిచూసుకుని ఆ వివరాలు వెల్లడిస్తున్నాం.

ఈ కేసులో తొలి ముద్దాయిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్ బాలికతో మాట క‌లిపాడు. అత‌డి కంటే ముందు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మ‌రో మైన‌ర్ కూడా ఆమెతో మాట క‌లిపాడు. ఈ క్ర‌మంలో వారిద్ద‌రూ బాధితురాలిని లైంగికంగా వేధించారు. ఈ వేధింపులు పెరిగిపోగా.. త‌న స్నేహితురాలితో క‌లిసి బాధితురాలు బ‌య‌ట‌కు వెళ్లింది. ప‌బ్‌లోనే సాదుద్దీన్‌తో క‌లిసి ఐదుగురు మైన‌ర్లు ప్లాన్ వేసుకున్నారు. బ‌య‌ట‌కు వెళ్లిన బాధితురాలిని ఇద్ద‌రు నిందితులు త‌మ‌ బెంజ్‌ కారులో ఎక్కించుకుని బంజారాహిల్స్‌లోని ఓ బేక‌రీకి వెళ్లారు. వారిని అనుస‌రించి ఇన్నోవా కారులో మ‌రో న‌లుగురు వెళ్లారు.

Hyderabad Gang Rape : గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐతో గానీ..లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : రఘునందన్ రావు

బేక‌రీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆరుగురు నిందితులు బాధితురాలిని ఇన్నోవాలో ఎక్కించుకుని జూబ్లీహిల్స్ పెద్ద‌మ్మ గుడి వెనుక నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి వెళ్లారు. కారులో వెళుతుండ‌గానే ఆమెపై నిందితులు బ‌లాత్కారం చేశారు. తీరా తాము అనుకున్న ప్రాంతానికి చేరుకున్నాక బాధితురాలిపై ఆరుగురు నిందితులు వ‌రుస‌గా అత్యాచారం చేశారు. ఈ సంద‌ర్భంగా వీడియోలు తీసుకున్నారు. వీడియోల‌ను ఒక‌రితో మ‌రొక‌రు షేర్ చేసుకున్నారు. అత్యాచారం త‌ర్వాత బాధితురాలిని ఆమ్నేషియా ప‌బ్ వద్దే వ‌దిలివెళ్లారు. ఆ తర్వాత బాధితురాలు తన తండ్రిని పిలిపించుకుని ఇంటికెళ్లిపోయింది.

త‌న‌పై అత్యాచారం జ‌రిగిన విష‌యాన్ని బాధితురాలు త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌లేదు. అయితే ఆమె మెడ‌పై అయిన గాయం చూసిన వారు మే 31న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా గ్యాంగ్ రేప్ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.

బాధితురాలిపై అత్యాచారం చేసింది ఐదుగురే అయినా.. కారులో ఆమెపై లైంగిక వేధింపుల‌కు గురి చేసిన మ‌రో మైన‌ర్‌ను కూడా గుర్తించి అరెస్ట్ చేశారు. మొత్తంగా ఈ కేసులో నిందితులు ఆరుగురు ఉండ‌గా.. వారిలో ఒక్క‌డే మేజ‌ర్‌. మిగిలిన ఐదుగురు మైన‌ర్లేన‌ని పోలీసులు తేల్చారు. సాదుద్దీన్ మాలిక్ మేజర్ కాగా… మైన‌ర్లు అయినందున మిగిలిన ఐదుగురి పేర్ల‌ను వెల్ల‌డించ‌డం కుద‌రదని సీవీ ఆనంద్ తెలిపారు.

ఈ కేసులో గ్యాంగ్ రేప్ సెక్ష‌న్లు (376డీ గ్యాంగ్ రేప్, 323 కాజింగ్ హర్ట్, పోక్సో చట్టం.. 366ఏ కిడ్నాపింగ్) న‌మోదు చేసిన నేప‌థ్యంలో నిందితుల‌కు మూడు ర‌కాల శిక్ష‌లు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు. నేరం నిరూపణ అయితే 20 ఏళ్ల జైలు శిక్ష‌, లేదంటే జీవించి ఉన్నంత కాలం పాటు జైలు శిక్ష‌, లేదంటే ఉరి శిక్ష‌ ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. అత్యాచారానికి పాల్ప‌డ‌ని నిందితుడికి కనిష్ఠంగా ఐదేళ్లు, గరిష్ఠంగా ఏడేళ్లు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు.

ఇక ఈ కేసులో ఐదుగురు నిందితులు మైన‌ర్లే కావ‌డంతో వారు ఎవ‌ర‌న్న విషయాన్ని చెప్ప‌డం కుద‌ర‌ద‌ని కూడా సీపీ చెప్పారు. వెర‌సి నిందితుల్లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడా? లేదా? అన్న‌ది తాము చెప్ప‌లేమ‌ని తెలిపారు. ఈ కేసులో హోంమంత్రి మ‌న‌వ‌డు ఉన్నాడ‌ని చాలా మంది ఆరోపించారని, అయితే ఆ దిశ‌గా ఆధారాలు దొర‌కలేద‌ని ఆయ‌న తెలిపారు. స‌ద‌రు ఆధారాలు ఏవైనా ఉంటే త‌మ‌కివ్వాల‌ని, ఆ ఆధారాలు నిజ‌మ‌ని తేలితే త‌ప్ప‌నిస‌రిగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా క‌మిష‌న‌ర్ చెప్పారు.(CV Anand)

ఏ నిమిషానికి ఏం జరిగింది?

మే 28 మధ్యాహ్నం 1.30కి బాధిత బాలిక, మరో బాలుడు పబ్‌లోకి వెళ్లారు. ఇద్దరూ లోపల డ్యాన్స్ చేశారు.

3 గంటలకు ఆ బాలుడు వెళ్లిపోయాడు. తరువాత మరో బాలిక ఈ బాధిత బాలికను కలిసింది.

3.15 గంటలు : మరో మైనర్ ఆమెను అప్రోచ్ అయ్యాడు. అతడికి సాదుద్దీన్ జత కలిశాడు. వారిద్దరూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.

5 గంటలు: తరువాత బాధిత బాలిక మరో బాలికతో కలిసి బయటకు వచ్చేసింది.

ఆ బాలిక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయింది. ఆ తరువాత బాధిత బాలికను నలుగురు మైనర్లు ట్రాప్ చేశారు.

5.45 గంటలు: ఈమెను తీసుకుని బెంజ్ కారులో వెళ్లారు. అదే సమయంలో సాదుద్దీన్, మరో ముగ్గురు మైనర్లు ఇన్నోవాలో బయలుదేరారు.

దారిలో బెంజ్ కారులోని నలుగురు మైనర్లు బాధిత బాలికకు బలవంతంగా ముద్దులు పెట్టారు. ఈ వీడియోలన్నీవారే తీశారు.

5.51 గంటలు: రెండు కార్లూ బేకరీకి చేరాయి.

5.54: బాధిత బాలిక బెంజ్ దిగి ఇన్నోవాలోకి వెళ్లింది.

5.57: రెండూ పార్కింగ్ చేశారు.(CV Anand)

6.15: ఇన్నోవా బయటకు వెళ్లింది… అందులో సాదుద్దీన్ ఉన్నాడు. బాధిత బాలిక, మరో అయిదుగురు మైనర్లు వెళ్లారు..

6.18: ఒక మైనర్ బేకరీకి తిరిగి వచ్చేశాడు.

సాదుద్దీన్, నలుగురు మైనర్లు, బాధిత బాలికను తీసుకుని అక్కడి నుంచి వెళ్లి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వెనుక వాహనం ఆపారు.

ఒక మైనర్ ఆమెను రేప్ చేశాడు.. ఆ తరువాత మిగతా నలుగురు రేప్ చేశారు. ఈ క్రమంలో ఆమెకు మెడపై, వేరే ప్రాంతాల్లో తీవ్ర గాయాలయ్యాయి.

7.31: ఇన్నోవాలో తీసుకొచ్చి బాలికను మళ్లీ పబ్ దగ్గరే వదిలిపెట్టారు.

ఆమె తన తండ్రికి ఫోన్ చేసి పార్కింగ్ నుంచి బయటకు రాగా రోడ్ నంబర్ 36కి తండ్రి వచ్చి ఆమెను తీసుకెళ్లారు.