Wife Extra Marital Affair : భార్యపై అనుమానం.. కూతుర్ని హత్య చేసిన తండ్రి
భార్యపై అనుమానంతో కన్న కూతుర్ని కత్తితో పొడిచి చంపాడో తండ్రి.
Wife Extra Marital Affair : భార్యపై అనుమానంతో కన్న కూతుర్ని కత్తితో పొడిచి చంపాడో తండ్రి. తమిళనాడు, చెన్నైలోని విల్లివాక్కం, రెడ్ హిల్స్, రోడ్ నెంబరు 5లో నివసించే రాధాకృష్ణన్ (34) లావణ్య(30)లు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె వదనశ్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. లావణ్య ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది.
రాధాకృష్ణన్ కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో భర్త పోరు పడలేని లావణ్య మూడు నెలల క్రితం తన పిల్లలిద్దర్నీ తీసుకుని భర్త నుంచి విడిపోయి వేరుగా నివసిస్తోంది. గత శనివారం అక్టోబర్ 30వతేదీ రాత్రి పిల్లల్ని చూసే నెపంతో రాధాకృష్ణన్, లావణ్య ఇంటికి వెళ్లాడు. ఆసమయంలో లావణ్య నైట్ డ్యూటీకీ వెళ్ళింది. తను ఇంట్లో లేని సమయంలో తండ్రి వస్తే మాట్లాడవద్దని పిల్లలకు ముందుగానే లావణ్య చెప్పింది.
రాధాకృష్ణన్ ఇంటికి వచ్చి తల్లి ఎవరితోనైనా మాట్లాడుతోందా అని నాలుగవ తరగతి చదువుతున్న తన కుమార్తె వదనశ్రీని పిలిచి అడిగాడు. బాలిక సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంది. ఎన్నిసార్లు అడిగినా బాలిక సమాధానం చెప్పకపోయే సరికి రాధాకృష్ణన్ కోపంతో రగిలిపోయాడు. వంటిట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి కూతురి భుజంపై,చేతులపై కత్తితో పొడిచాడు. దీంతో బాలిక ఏడవసాగింది. ఏడవోద్దని రాధాకృష్ణన్ మళ్లీ బాలికపై కత్తితో దాడి చేశాడు. ఐనా బాలిక ఏడుపు ఆపకపోయేసరికి గొంతుకోసి పరారయ్యాడు.
Also Read : Judge Raped Minor Boy : మైనర్ బాలుడిపై అత్యాచారం చేసిన జడ్జి- పోక్సో కేసు నమోదు
బాలిక ఏడుపు విన్న చుట్టు పక్కలవారు ఇంటికి వచ్చి చూసి లావణ్యకు సమాచారం ఇచ్చారు. వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి బాలికను తీసుకువెళ్లారు. అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. తెల్లవారు ఝూమున 3 గంటల సమయంలో రాధాకృష్ణన్ విల్లివాక్కం పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.