Gangster Jitender Gogi : గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగిని ఎవరు చంపారు ? కోర్టుకు ప్రత్యర్థులు ఎలా వచ్చారు ?
జితేందర్ గోగిని చంపడానికి టిల్లు గ్యాంగ్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. 2015లోనే టిల్లును పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతా వైఫల్యం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Delhi Court : ఢిల్లీ కోర్టులో గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. 2021, సెప్టెంబర్ 24వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం రోహిణి కోర్టు ఆవరణలో రెండు గ్రూపుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. గ్యాంగ్స్టర్ జితేందర్ మన్ గోగిని దుండగులు కాల్చి చంపారు. దీని తర్వాత కోర్టు పరిసరాల్లో కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన వారిని కూడా కాల్చి చంపారు. గ్యాంగ్స్టర్ జితేందర్తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. 30 నుంచి 40 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. రూమ్ నెంబర్ 207లో ఈ కాల్పులు జరిగాయి. ఢిల్లీకి చెందిన టిల్లూ గ్యాంగ్ జితేంద్రను హత్య చేసినట్లు తెలుస్తోంది. దాడి చేసిన వారిలో ఇద్దరు మృతి చెందారు.
Read More : kanpur Crime : సెక్రటరీని రేప్ చేసి..10వ అంతస్థు నుంచి తోసే’సిన బాస్
దుండగులు కోర్టుకు ఎలా వచ్చారంటే : –
దుండగులు లాయర్ వేషంలో కోర్టులోకి వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. జితేంద్రను రెండేళ్ల ముందు స్పెషల్ సెల్ పోలీసులు గురుగ్రామ్లో అరెస్ట్ చేశారు. జితేందర్జోగి ఢిల్లీలో మోస్ట్ వాటెండ్ గ్యాంగ్స్టర్… పలు కేసుల్లో అరెస్టైన అతను జైల్లో ఉన్నాడు. ఓ కేసు విచారణ కోసం అతడిని శుక్రవారం కోర్టుకు తీసుకువచ్చారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న ప్రత్యర్థులు పక్కా ప్లాన్ వేశారు. లాయర్ల వేషంలో తుపాకులతో కోర్టులోకి చేరుకున్నారు. గోగిని తీసుకువచ్చే మార్గంలో లాయర్లలాగా నిలబడ్డారు. గోగిని కోర్టు హాల్లోకి తీసుకు రాగానే అతడిపై కాల్పులు జరిపారు.
Read More : Rohini court : ఎవరీ గ్యాంగ్స్టర్ జితేందర్ గోగి, ఎక్కడుండే వాడు ? ఏం చేస్తుంటాడు ?
దుండగులను మట్టుబెట్టిన పోలీసులు : –
లోపల తనపై దాడి జరుగుతుందని ఊహించని గోగి తేరుకునేలోగానే తూటాలు శరీరాన్ని చీల్చేశాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. గోగిపై కాల్పులు జరిపిన దుండగులపై పోలీసులు కాల్పులు జరిపారు. లాయర్ల వేషంలో ఉన్న ఇద్దరు దుండగులు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది లాయర్లు ఉండటం, ఎవరెవరో అర్థం కాకపోవడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అయితే కాల్పులు జరుపుతున్న వారిని గుర్తించి ఎస్కార్ట్ పోలీసులు వారిని మట్టుబెట్టారు. కొన్ని నెలల క్రితం గోగి అనుచరుడు కుల్దీప్ కర్కర్దుమా కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు తప్పించుకున్నాడు. దీంతో గోగి వెంట ఎప్పుడూ కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్ను ఉంచుతున్నారు. ఆ టీమ్ సభ్యులే ఇద్దరు దుండగుల్ని కాల్చి చంపారు.
Read More : Delhi Court : కోర్టులో గ్యాంగ్స్టర్ల మధ్య కాల్పులు, జితేందర్ గోగి హతం
కోర్టులో భద్రతా వైఫల్యం : –
జితేందర్ గోగిని చంపడానికి టిల్లు గ్యాంగ్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. 2015లోనే టిల్లును పోలీసులు అరెస్ట్ చేశారు. తన గ్యాంగ్ను తుడిచిపెట్టేసిన జితేందర్పై కసితో ఉన్న టిల్లు అప్పట్నుంచి పగతో రగిలిపోతున్నాడు. జైల్లో నుంచే జితేందర్గోగి హత్యకు కుట్రపన్నాడు. మట్టుబెట్టగలిగాడు. రోహిణీ కోర్టులో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పటిష్ఠ భద్రత ఉండే కోర్టులోకి తుపాకులు ఎలా వచ్చాయనేది ప్రశ్నగా మారింది. లోపలకు వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అయితే వారు ఆయుధాలు లోపలకు ఎలా తీసుకెళ్లారన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. భద్రతా వైఫల్యం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కోర్టులోకి ఎవరు వస్తున్నారు, ఏం తెస్తున్నారనేది పోలీసులు ఎప్పుడూ పట్టించుకోరని లాయర్లు ఆరోపిస్తున్నారు.