సీన్ రివర్స్.. ప్రియుడిపై కత్తితో దాడి చేసిన ప్రియురాలు

ప్రేమకు నో చెప్పిందనో, పెళ్లికి తిరస్కరించిందనో, మోసం చేసిందనో.. ఇలా రకరకాల కారణాలతో ప్రియుడు సైకోగా

  • Published By: naveen ,Published On : May 26, 2020 / 05:40 AM IST
సీన్ రివర్స్.. ప్రియుడిపై కత్తితో దాడి చేసిన ప్రియురాలు

ప్రేమకు నో చెప్పిందనో, పెళ్లికి తిరస్కరించిందనో, మోసం చేసిందనో.. ఇలా రకరకాల కారణాలతో ప్రియుడు సైకోగా

ప్రేమకు నో చెప్పిందనో, పెళ్లికి తిరస్కరించిందనో, మోసం చేసిందనో.. ఇలా రకరకాల కారణాలతో ప్రియుడు సైకోగా మారి ప్రియురాలిపై దాడి చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై ఒత్తిడి తెచ్చిన ప్రియురాలు, అతడు నో చెప్పేసరికి కత్తితో దాడి చేసి చంపబోయింది. ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది.

రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్న యువతీ, యువకుడు:
ప్రేమించిన యువకుడిపై ప్రియురాలు దాడి చేసిన సంఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డలో జరిగింది. మచిలీపట్నం ఇంగ్లీషుపాలెం గ్రామానికి చెందిన యువతి మచిలీపట్నంలోని ఓ కాలేజీలో పనిచేస్తోంది. గూడూరుకు చెందిన యువకుడు పెడన తహసీల్దార్‌ ఆఫీస్ లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్న వీరిద్దరూ ఇటీవల చల్లపల్లి మండలంలోని వక్కలగడ్డ గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

అపస్మారక స్థితిలో యువతి:
సోమవారం(మే 25,2020) ఏం జరిగిందో కానీ, ఇంటి దగ్గర యువకుడు కత్తిపోట్లుకు గురై కనిపించాడు. యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వారిని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపస్మారకస్థితిలో ఉన్న యువతిని అత్యవసర చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుడు చల్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై బాధితుడు స్పందించాడు. అసలేం జరిగిందో చెప్పాడు.

కలిసి బతుకుదాం లేదా కలిసి చద్దాం:
గత కొన్నాళ్లుగా ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చిందని, తాను తిరస్కరిస్తూ వస్తున్నానని చెప్పాడు. చివరిసారిగా కలసి మాట్లాడుకుందామని పిలిస్తే సోమవారం ఉదయం వక్కలగడ్డకు వచ్చామని చెప్పాడు. పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలసి బతుకుదాం, లేకుంటే కలసి చనిపోదామని సాయంత్రం 4 గంటల సమయంలో తనపై కత్తితో దాడి చేసి ఆమె నిద్రమాత్రలు మింగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అపస్మారక స్థితి నుంచి సదరు యువతి బయటకు వస్తే ఈ కేసుకు సంబంధించిన అసలు విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అసలేం జరిగింది? ప్రియుడిపై దాడికి కారణం ఏంటి? ఇందులో తప్పు ఎవరిది? బాధితుడు చెప్పిన దాంట్లో నిజమెంత? అనే విషయాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.