TS-EAMCETలో ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగింపు!
TS- EAMCET : ఎంసెట్లో నిబంధనలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
కరోనా వైరస్ కారణంగా ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎంసెట్ పరీక్ష రాయాలంటే ఇంటర్లో కనీసం 45శాతం మార్కులు సాధించి ఉండాలి.
కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే పాస్ మార్కులతో ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు.
ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగించాలని కోరారు. పిటిషన్పై స్పందించిన కోర్టు.. తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ను నిలిపివేయాలని జేఎన్టీయూని ఆదేశించింది.
విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని సర్కార్ సానుకూలంగా స్పందించింది. ఎంసెట్ నిబంధనలను సవరిస్తూ జీవో జారీచేసింది. ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థులు లబ్ధిపొందనున్నారు.
ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చినా లెక్కలోకి తీసుకోరు. ఇంటర్ పాసైన విద్యార్థులు ఎవరైనా ఎంసెట్ కౌన్సిలింగ్కు హాజరయ్యేలా విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది.
ఈ ఏడాదిలో ఇంటర్మీడియట్ సెకండ్ ఈయర్ పరీక్షలకు మొత్తం 4.11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు 2,83,631 మంది ఉన్నారు. 1.75లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.