తెలంగాణలో వడదెబ్బకు 8మంది మృతి
భానుడి భగభగలకు తెలుగురాష్ట్రాలలో ప్రజలు అల్లాడిపోతున్నారు. సూర్యుని ప్రతాపానికి తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం(12 మే 2019) వడదెబ్బ తగిలి 8 మంది చనిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు వడదెబ్బ తగిలి మృతిచెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామానికి చెందిన మ్యాకల లక్ష్మీదేవమ్మ(70), కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం పోలంపల్లిలో పడాల లచ్చమ్మ(65), పెద్దపల్లి జిల్లా అల్లూరులో కోటగిరి రాజయ్య(65), జంగాలపల్లికి చెందిన ఆదాము(40) వడదెబ్బతో మృతి చెందారు.
అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన దాచెపల్లి భారతమ్మ(75) ఎండతీవ్రత తట్టు కోలేక మృతి చెందింది. సంస్థాన్నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన పంది ముత్యాలు(45) అస్వస్థతకు గురై చనిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటిలో ఉపాధి కూలీ ఇప్ప అడెల్లు(49), భద్రాద్రి జిల్లా భద్రాచలం మెడికల్ కాలనీలో మీరా సాహెబ్(69) వడదెబ్బ తగిలి చనిపోయారు.