గణేష్ ఉత్సవాలు : హుస్సేన్ సాగర తీరంలో గంగా మహా హారతి
గణేశ్ ఉత్సవాలు వచ్చాయంటేనే హైదరాబాద్ కొత్త శోభను సంతరించుకుంటుంది. పది రోజులు పండుగ వాతావరణం వెల్లివిరిస్తుంది. ఈ సారి ఆ సందడికి, శోభకు మరింత కళను అద్దుతూ.. సరికొత్త కార్యక్రమానికి ప్లాన్ చేసింది ప్రభుత్వం. కాశీలోనో లేదా మరేదైనా ఉత్తరాది రాష్ర్టాల్లోనో మహాహరతి ఇస్తుంటారు. ఇది చూడటానికి భక్తులు ఆసక్తిని కనబరుస్తుంటారు. అలాంటి అనుభూతిని హైదరాబాద్ వాసులకు ఎందుకు కల్పించకూడడు..అది వినాయక చవితి పర్వదినంలో..అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది. గణేశ్ ఉత్సవాల సమయంలో హుస్సేన్ సాగర్ వద్ద మహా హారతి కార్యక్రమం నిర్వహించాలని భావిస్తోంది.
వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్ భక్తి పారవశ్యంలో మనిగిపోతుంది. అంతటా సందడి..సందడి నెలకొంటోంది. నవరాత్రులు ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. అతిపెద్దదిగా పేరు గాంచిన ఖైరతాబాద్ గణేష్ని చూడటానికి భక్తులు పోటెత్తుతుంటారు. అయితే..నిమజ్జన కార్యక్రమం ఉత్సవాలకే హైలెట్గా నిలుస్తుంది. పదో రోజు తీన్ మార్ స్టెప్పులతో సాగనంపుతారు. నిమజ్జన కార్యక్రమం అద్భుతంగా జరిగే ఈ కార్యక్రమాన్ని చూడటానికి తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా.. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్ చేరుకుంటుంటారు.
హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోతుంటాయి. గంగా మహా హారితి పేరిట సాగర్ తీరంలో వందల మంది పండితులు, వేద పండితుల మధ్య హారతి కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనివల్ల సందర్శకుల సందడి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది జీహెచ్ఎంసీ. దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలు ఇప్పటికే ఫేమస్ కాగా.. ప్రభుత్వం శ్రీకారం చుట్టిన గంగా మహా హారతి కార్యక్రమంతో మరింత ప్రాచుర్యం పొందనుంది. భక్తుల రద్దీ పెరగనుంది.
Read More : Naaptol Online పేరిట మోసం : కారు చెప్పి రూ. 16 లక్షల టోకరా