18 ఏళ్లు పాకిస్తాన్ జైల్లో మగ్గిపోయిన ముంబై మహిళ..65 ఏళ్ల వయస్సులో విడుదల
65 year old woman freed from pakistani jail : భర్త తరపు బంధువల్ని చూడటానికి పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అక్కడే ఇరుక్కుపోయింది. జైలు పాలైంది. అలా 18 ఏళ్లు పాకిస్థాన్ జైల్లోనే మగ్గిపోయింది. చివరకు ఔరంగబాద్ పోలీసులు చేసిన ప్రయత్నంతో ఆమె పాక్ జైలు నుంచి తన 65 ఏళ్ల వయస్సులో విడుదలైంది. తన స్వస్థలానికి చేరుకుంది. తన సొంత ప్రాంతానికి చేరుకోగానే ‘‘హమ్మయ్యా..స్వర్గంలోకి వచ్చినట్లుందయ్యా’ అంటూ ఆనంద భాష్పాలు రాల్చింది.
ఔరంగబాద్కు చెందిన హసీనా బేగం అనే 65ఏళ్ల మహిళ 18 ఏండ్ల క్రితం తన భర్త బంధువులను చూసేందుకు పాకిస్తాన్ వెళ్లింది. ఈ క్రమంలో ఆమె పాపం తన పాస్పోర్టు లాహోర్లో మిస్ చేసుకుంది. అలా ఎలా మిస్ అయ్యిందో కూడా ఆమెకు తెలియలేదు. దీంతో ఆమెను పాక్ పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
అయితే హసీనా బేగం అదృశ్యమైనట్లు ఆమె బంధువులు 18 ఏళ్ల క్రితం ఔరంగాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. కానీ ఆమో ఆచూకీ కోసం యత్నిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ పోలీసులకు ఔరంగబాద్ పోలీసులు లేఖ రాశారు. అలా హసీనా ఆచూకీ తెలిసింది. అదే విషయాన్ని పాక్ పోలీసులు వెల్లడించారు. ఆమె పాక్ జైల్లో ఉందని పాక్ వర్గాలు తెలిపాయి. అలా మొత్తానికి ఔరంగబాద్ పోలీసుల తీవ్ర యత్నాలతో హసీనా 18ఏళ్ల తరువాత భారత్ కు తిరిగొచ్చింది.
ఈ శుభ సందర్భంగా హసీనా మాట్లాడుతూ..నా మాతృదేశం వచ్చాక నాకు స్వర్గంలో ఉన్నట్టు ఉంది అని ఆనందం వ్యక్తంచేసారు. పాకిస్తాన్లో తాను ఎన్నో కష్టాలు పడ్డానని..కానీ ఎట్టకేలకు నేను నా స్వదేశానికి చేరుకోగలిగాననీ సంతోషం వ్యక్తంచేసారామె. ఇక్కడి గాలి పీల్చుకోవడంతో ప్రశాంతంగా ఉందని..నేను భారత్ రావటానికి సహాయం చేసిన ఔరంగబాద్ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని హసీనా తెలిపారు.