Russia Invasion : దండయాత్ర మొదలైంది.. రష్యాపై ఆంక్షలు విధించాల్సిందే- బ్రిటన్ కీలక వ్యాఖ్యలు
యుక్రెయిన్, రష్యా సంక్షోభంపై బ్రిటన్ కీలక వ్యాఖ్యలు చేసింది. యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలెట్టేసిందని, ఇక ఆంక్షలు తప్పవని బ్రిటన్ చెప్పింది.
Russia Invasion : యుక్రెయిన్, రష్యా సంక్షోభంపై బ్రిటన్ కీలక వ్యాఖ్యలు చేసింది. యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలెట్టేసిందని, ఇక ఆంక్షలు తప్పవని బ్రిటన్ చెప్పింది. యుక్రెయిన్పై రష్యా ఆక్రమణ మొదలైందని బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ అన్నారు. ఈ నేపథ్యంలో రష్యాపై.. బ్రిటన్ ఆంక్షలు విధించాలని ఆయన సూచించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వంలో జరిగిన అత్యవసర సమావేశం జరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో యుక్రెయిన్ సంక్షోభం పై చర్చించారు.
‘‘యుక్రెయిన్ ఆక్రమణ మొదలైందని మీరు అనుకోవచ్చు. అందుకే ముందుగానే చెప్పినట్లు ఆంక్షలను విధిస్తాము. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన వీలైనంత మందిని ఈ ఆంక్షల పరిధిలోకి తెస్తాము’’ అని సాజిద్ అన్నారు. అంతకుముందే రష్యా కంపెనీలు, ఇతర సంస్థలు.. డాలర్లు, బ్రిటిష్ పౌండ్లు వాడకుండా నిషేధించడంతోపాటు.. బ్రిటన్ నుంచి పెట్టుబడులు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని గతంలోనే యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. రష్యా బ్యాంకులు కూడా ఈసారి ఆంక్షల పరిధిలోకి రావచ్చు. ప్రధాని బోరిస్ జాన్సన్ పార్లమెంట్లో ఈ ఆంక్షలను ప్రకటించే అవకాశం ఉందని జావెద్ తెలిపారు.
యుక్రెయిన్ విషయంలో రష్యా దూకుడు చర్యలను అమెరికా సహా పశ్చిమ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కఠిన ఆంక్షలు విధిస్తామని ప్రపంచ దేశాలు హెచ్చరించినా.. నాటో భారీగా ఆయుధాలను ఉక్రెయిన్కు తరలిస్తున్నా.. రష్యా అధినేత పుతిన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. డాన్బాస్ ప్రాంతాన్ని రెండు స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఏడేళ్ల నుంచి అమల్లో ఉన్న మింస్క్-2 ఒప్పందం కనుమరుగైంది. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాలు ఆంక్షల కొరడా ఝళిపించడానికి సిద్ధమవుతున్నాయి.
2014లో క్రిమియా ఆక్రమణ తర్వాత నుంచి డాన్బాస్ ప్రాంతంలో అశాంతి పెరిగిపోయింది. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు 6,500 చదరపు మైళ్లను ఆక్రమించుకుని వీటిని పీపుల్స్ రిపబ్లిక్లుగా ప్రకటించుకున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 3.8 మిలియన్ల జనాభా ఉండగా.. పెద్ద సంఖ్యలో రష్యాభాష మాట్లాడేవారు ఉన్నారు. 2014 నుంచి జరుగుతున్న అంతర్యుద్ధంలో దాదాపు 14వేల మంది మరణించారు. దాదాపు 20 లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు.
Russia-Ukraine crisis: ‘వెయిట్ చేయొద్దు.. వెంటనే రిటర్న్ అయిపోండి’
2015లో హింస తీవ్రం కావడంతో రష్యా, బెలారస్, యుక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాధినేతలు మింస్క్ నగరంలో భేటీ అయి ఓ శాంతి ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం డాన్బాస్ ప్రాంతంలోని వాటికి ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తిని యుక్రెయిన్ ఇవ్వాలి. దీనికి బదులుగా రష్యాతో సరిహద్దు నియంత్రణ అధికారాన్ని రెబల్స్.. యుక్రెయిన్కు బదలాయించాలి. కానీ, ఈ ఒప్పందాన్ని యుక్రెయిన్ అమలు చేయలేదు.
యుక్రెయిన్ సంక్షోభం మరింతగా ముదురుతోంది. దేశంలోని తూర్పు భాగంలో యుక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాలను ‘స్వతంత్ర దేశాలు’గా గుర్తిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో యుక్రెయిన్, రష్యా సంక్షోభం మరింత ముదిరింది. పుతిన్ నిర్ణయంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యాన్ని పోసినట్టయింది. ఒక్కసారిగా ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుక్రెయిన్లో రష్యా మద్దతిచ్చే వేర్పాటువాదుల నియంత్రణలో రెండు ప్రాంతాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లాంఛనంగా గుర్తించారు. ఆ రెండు ప్రాంతాలపై లుహాన్క్, డోనెస్క్లు, రష్యా సైనిక బలగాలను పంపుతామని ఇప్పటికే పుతిన్ వెల్లడించారు. శాంతి పరిరక్షణ కార్యకలాపాలను సైనిక బలగాలు నిర్వర్తిస్తాయని పుతిన్ రష్యా ప్రజలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు.