న్యూయార్క్ లో ఒక్కపూట తిండి కోసం అల్లాడుతున్న 20లక్షలమంది: అగ్రరాజ్యంలో ఆకలి కేకలు

అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా కరోనా వైరస్ తరువాత ఆకలితో అల్లాడిపోతోంది. కరోనా దెబ్బకు ఒకవైపు అమెరికా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మరోవైపు ఆకలితో అల్లాడుతున్నారు న్యూయార్క్ ప్రజలు. ఇది ఎన్నడూ ఊహించిన దెబ్బ అగ్రరాజ్యానికి.
ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత బలమైన దేశం అమెరికా అని చెప్పుకుంటూ తన అహంకార ధోరణిని ఎప్పుడూ నిలబెట్టుకునే అమెరికాలో ఆకలితో ప్రజలు అల్లాడిపోతున్నారు. కేవలం ఒక్కపూట కడుపునింపుకోవటానికి నానా అగచాట్లు పడుతున్నారు. ఇది నిజం.
కరోనా దెబ్బకు అగ్రరాజ్యం విలవిల్లాడుతోంది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.కనీసం ఒక్క పూట తినడానికి తిండి లేక పేదలు అల్లాడుతున్నారు.న్యూయార్క్ నగరంలో ఆహార అభద్రత పెద్ద సమస్యగా తయారైంది.ఇదేదో ఏ దేశంలో అమెరికా అప్రతిష్టపాలు చేయటానికి చెప్పినమాట కాదు సాక్షాత్తు న్యూయార్క్ మేయర్ చెప్పిన మాట.
దీనిపై న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో మాట్లాడుతూ..గతంలో న్యూయార్క్ నగరంలో 10 లక్షల మంది పేదలు ఉండేవారని.. కరోనా కారణంగా ఆ సంఖ్య రెట్టింపు అయిందని చెప్పారు. దీంతో నగరంలోని పేద ప్రజల కోసం వచ్చే వారం నుంచి ఉచిత భోజన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అమెరికాలో మొత్తం 16.30 లక్షల మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 3.60 లక్షల మంది న్యూయార్క్ వాసులే కావడం గమనించాల్సిన విషయం. యూఎస్ లో కరోనా మృతుల సంఖ్య లక్షకు చేరువవుతోంది.