Russia-Ukraine War : రూటు మార్చిన పుతిన్.. సామాన్య ప్రజలే టార్గెట్గా బాంబులు, మిసైళ్ల వర్షం..!
Russia-Ukraine War : యుక్రెయిన్ను ఆక్రమించుకునే ఉద్దేశం లేదంటూనే పుతిన్ రూటు మార్చారు. యుక్రెయిన్ సామాన్య ప్రజలను టార్గెట్గా బాంబులు, మిసైళ్ల వర్షం కురిపిస్తోంది.
Russia-Ukraine War : యుక్రెయిన్ను ఆక్రమించుకునే ఉద్దేశం లేదంటూనే పుతిన్ రూటు మార్చారు. మొన్నటి వరకూ యుక్రెయిన్ భద్రతా దళాలను టార్గెట్ చేసిన రష్యన్ ఆర్మీ.. ఇప్పుడు సామాన్య ప్రజలపై ప్రతాపం చూపుతోంది. అపార్ట్మెంట్లు, ఇండ్లపై బాంబుల వర్షం కురిపిస్తోంది. బంకర్లపై మిసైళ్లు ప్రయోగిస్తోంది. దీంతో వేలాది మంది ప్రజలు.. అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను తిరస్కరిస్తున్నామని రష్యా స్పష్టం చేసింది. యుద్ధం ప్రారంభమై 22 రోజులైనా కూడా యుక్రెయిన్పై భీకర దాడికి పాల్పడుతోంది రష్యా. సామాన్య ప్రజలే టార్గెట్గా బాంబులు, మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. నడి వీధుల్లో ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.
ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆతృతతో చంకలో చంటి బిడ్డలనెత్తుకొని తల్లులు సరిహద్దులు దాటుతున్నారు. మాటలకందని మారణహోమానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది యుక్రెయిన్. కళ్ల నిండా నీళ్లు.. గుండె నిండా భారం.. తలదాచుకోవటానికి అందరికీ బంకర్లు లేక.. గోడు గోడున ఏడుస్తున్నారు అక్కడి ప్రజలు. కేవలం సైనికులు, సైనిక స్థావరాలే అంటూ దండయాత్ర మొదలుపెట్టిన రష్యా.. ఇప్పుడు సామాన్యులే టార్గెట్గా విరుచుకుపడుతోంది. తీరప్రాంత నగరమైన మరియుపోల్లోని ఒక థియేటర్పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. రష్యా సేనలు ఉద్దేశపూర్వకంగానే పౌరులపై మారణహోమానికి పాల్పడ్డాయని యుక్రెయిన్ ఆరోపిస్తోంది.
Russia-Ukraine War : బ్రెడ్ కోసం నిలబడ్డ వారిపై కాల్పులు.. 13 మంది మృతి
ఈ దాడులో వందలాది మంది చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. వీరిలో మహిళలు, వృద్ధులు, చిన్నారులూ ఉండడం మరింత కలిచివేస్తోంది. రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత మరియుపోల్లో దాదాపు 3 లక్షల మంది చిక్కుకుపోగా.. 3 వేల మంది మరణించారు. అలా బయటకు అడుగేసిన వాళ్లు మళ్లీ ఇంటికి రావడంలేదు. బ్రెడ్ కోసం క్యూలో నిలబడ్డ వారిని కూడా వదలడం లేదు రష్యా సైనికులు. యుక్రెయిన్ ఉత్తర ప్రాంతంలోని చెర్నిహివ్ పట్టణంలో బ్రెడ్ కోసం క్యూలో నిలబడి ఉన్న 13 మందిని రష్యా సైనికులు కాల్చి చంపారంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. యుక్రెయిన్లో యుద్ధ బీభత్సాన్ని కళ్లకు గట్టే దృశ్యాలు ఇలాంటివెన్నో ఉన్నాయి.
రష్యా దాడులకు నిత్యం వేల మంది అయిన వారికి దూరమవుతున్నారు. నగరాలను శిథిలం చేయడమే కాదు.. పెద్దఎత్తున ప్రజల ప్రాణాలను బలిగొంటోంది రష్యా. దండయాత్ర మొదలై మూడు వారాలు దాటినా ఇంకా లక్ష్యం పూర్తికాకపోవడంతో అసహనంగా ఉన్న రష్యా సైన్యం దూకుడు పెంచింది. ప్రధానంగా రాజధాని కీవ్పై దృష్టి పెట్టింది. కీవ్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు నగరం లోపల సైతం రష్యా బలగాలు నిప్పుల వర్షం కురిపించాయి. సెంట్రల్ కీవ్లో ఎత్తైన భవనాలు, అపార్ట్మెంట్లు టార్గెట్గా చేసుకొని బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో పదుల సంఖ్యలో సామాన్య జనం మరణిస్తున్నారు. భవనాలన్నీ శిథిలమై శ్మశానాన్ని తలపిస్తున్నాయి.
Read Also : Ukraine Russia War : యుక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుదశకు చేరుకుందా?