Pakistan: పాక్లోని పెషావర్లో పోలీసు బృందంపై ఉగ్రవాదుల దాడి.. డీఎస్పీసహా ముగ్గురు మృతి
పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆ దేశంలోని పెషావర్లోని సర్బంద్ పోలీసు స్టేషన్ పై దాడి చేయగా.. డీఎస్పీ సహా ముగ్గురు పోలీసులు మరణించారు.
Pakistan: పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆ దేశంలోని పెషావర్లోని సర్బంద్ పోలీసు స్టేషన్ పై దాడి చేయగా.. డీఎస్పీ సహా ముగ్గురు పోలీసులు మరణించారు. శనివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదుల దాడి అనంతరం ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. దాడికి పాల్పడినవారిని పట్టుకొనేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఉగ్రవాదుల వద్ద మారణాయుధాలు, నైట్ విజన్ గ్లాసెస్ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాదుల దాడి సమయంలో పోలీసులు ప్రతిఘటించారు. దీంతో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆప్ పోలీస్ (డీఎస్పీ) సర్దార్ హుస్సేన్ సహా ముగ్గురు పోలీస్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సర్బంద్ స్టేషన్ రెండువైపుల నుంచి ఉగ్రవాదులు లాంగ్ రేంజ్ రైఫిళ్లు, హ్యాండ్ గ్రెనేడ్లతో దాడిచేశారు.
ఘటన సమాచారం అందుకున్న పోలీసు బలగాలు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఉగ్రవాదుల దాడిలో గాయపడిన పలువురు పోలీస్ సిబ్బందిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన సమయంలో పోలీస్ స్టేషన్లో 12 నుంచి 14 మంది వరకు ఉన్నారు. ఉగ్రవాదులకోసం గాలింపుచర్యలు చేపట్టారు.