Ukraine Crisis : యుక్రెయిన్ గగనతలంలో అమెరికా స్పై విమానాలు
నిఘా కోసం ఈ స్పై విమానాలను అమెరికా పంపినట్టు సమాచారం. రష్యా దాడులకు పాల్పడితే తగిన విధంగా స్పందించేందుకు అమెరికా సిద్దమవుతోంది.
Ukraine Crisis : యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా కయ్యానికి కాలు దువ్వుతోంది. యుక్రెయిన్ పై దండయాత్రకు రష్యా సన్నద్ధం అవుతోందనే వార్తలు వస్తున్నాయి. అయితే, యుక్రెయిన్కు నాటో, యూరప్తో పాటు అమెరికా మద్దతుగా నిలిచింది. అమెరికా తన బలగాలను పోలెండ్కు పంపిన సంగతి తెలిసిందే. యుక్రెయిన్కు మద్దతుగా అమెరికా బలగాలు పోలెండ్కు చేరుకున్నాయి. అయితే, నెల రోజుల కాలంలో రెండుసార్లు అమెరికాకి చెందిన రెండు స్పై విమానాలు బ్లాక్ సీ మీదుగా యుక్రెయిన్ గగనతలంలోకి ప్రవేశించాయి. నిఘా కోసం ఈ స్పై విమానాలను అమెరికా పంపినట్టు సమాచారం. రష్యా దాడులకు పాల్పడితే తగిన విధంగా స్పందించేందుకు అమెరికా సిద్దమవుతోంది.
ఎవరెన్ని చెప్పినా తగ్గేదేలే అన్నట్టుగా రష్యా తీరుంది. యుక్రెయిన్ లోని ప్రత్యేక వేర్పాటువాదుల ప్రాంతాలను రెండు స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ డిక్లరేషన్పై సంతకం చేసింది రష్యా. యుక్రెయిన్ను నిర్వీర్యం చేసి పూర్తిగా దానిని రష్యాలో కలుపుకోవడమే లక్ష్యంగా పుతిన్ ఎత్తులు వేస్తున్నారు.
చరిత్రను సాక్ష్యంగా చూపిస్తూ యుక్రెయిన్ను విలీనం చేసుకోవడానికి రష్యా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యుక్రెయిన్, రష్యాలు వేర్వేరు దేశాలు కాదని చరిత్రను గుర్తుచేస్తున్నారు. గతంలో క్రిమియాను ఆక్రమించుకున్న సమయంలో కూడా పుతిన్ ఇదే విధమైన చరిత్రను గుర్తు చేసుకున్నారు.
అసలు యుక్రెయిన్ అన్నది ఒక దేశం కాదని, ఎప్పుడూ అది స్థిరంగా ఉండలేదని పుతిన్ అన్నారు.
ఇప్పటికే డాన్బాస్ ప్రాంతాన్ని రెండు స్వతంత్ర దేశాలుగా ప్రకటించారు. మరోవైపు యుక్రెయిన్కు సపోర్ట్గా భారీ సంఖ్యలో ఆయుధాలను యుక్రెయిన్కు సరఫరా చేస్తోంది నాటో. 1954 ను క్రిమియాను అప్పటి రష్యా అధ్యక్షుడు కృశ్చేవ్.. యుక్రెయిన్కు బహుమతిగా ఇచ్చారని చరిత్ర చెబుతుంది. అయితే, క్రిమియాలో రష్యా భాషను మాట్లాడే ప్రజలు, రష్యా మూలాలున్న ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో క్రిమియా రష్యాలో భాగమే అని చెప్పి 2014లో ఆక్రమించుకున్నారు.
యుక్రెయిన్ విషయంలో రష్యా దూకుడు చర్యలను అమెరికా సహా పశ్చిమ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కఠిన ఆంక్షలు విధిస్తామని ప్రపంచ దేశాలు హెచ్చరించినా.. నాటో భారీగా ఆయుధాలను ఉక్రెయిన్కు తరలిస్తున్నా.. రష్యా అధినేత పుతిన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. డాన్బాస్ ప్రాంతాన్ని రెండు స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఏడేళ్ల నుంచి అమల్లో ఉన్న మింస్క్-2 ఒప్పందం కనుమరుగైంది. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాలు ఆంక్షల కొరడా ఝళిపించడానికి సిద్ధమవుతున్నాయి.
Russia-Ukraine crisis: ‘వెయిట్ చేయొద్దు.. వెంటనే రిటర్న్ అయిపోండి’
2014లో క్రిమియా ఆక్రమణ తర్వాత నుంచి డాన్బాస్ ప్రాంతంలో అశాంతి పెరిగిపోయింది. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు 6,500 చదరపు మైళ్లను ఆక్రమించుకుని వీటిని పీపుల్స్ రిపబ్లిక్లుగా ప్రకటించుకున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 3.8 మిలియన్ల జనాభా ఉండగా.. పెద్ద సంఖ్యలో రష్యాభాష మాట్లాడేవారు ఉన్నారు. 2014 నుంచి జరుగుతున్న అంతర్యుద్ధంలో దాదాపు 14వేల మంది మరణించారు. దాదాపు 20 లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు.