కరోనా ఎఫెక్ట్, పెట్రోల్ బంకులు, రేషన్ షాపుల్లో కొత్త రూల్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. తాజాగా పెట్రోల్ బంకుల్లో కొత్త నిబంధనం తీసుకొచ్చారు. నో మాస్క్ నో పెట్రోల్ అనే నిదానం వినిపిస్తున్నారు. అంటే, మాస్క్ ఉంటేనే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోస్తారు. లేదంటే వెనక్కి పంపేస్తారన్నమాట. రేషన్ షాపులకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. ముఖానికి మాస్క్ ఉంటేనే రేషన్ ఇస్తారు. లేదంటే వెనక్కి పంపుతారు.
నో మాస్క్ నో పెట్రోల్, నో రేషన్:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు గోవా ప్రభుత్వం కఠిన చర్యలను చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న గోవా.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ముఖాలకు మాస్క్ లేకపోతే వాహనాలకు పెట్రోల్ పోసేదిలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ బంకుల యాజామాన్యలకు ఆదేశాలు జారీచేసింది. అలాగే రేషన్ షాపుల దగ్గర కూడా మాస్క్లతో రావాలని, లేకపోతే రేషన్ నిలిపివేస్తామని హెచ్చరించింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వం తెలిపింది.(మాస్క్ ఉంటేనే పెట్రోల్.. రేషన్ కూడా!)
గోవాలో 7 కరోనా కేసులు:
కాగా గోవాలో ఇప్పటి వరకు కేవలం 7 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైన విషయం తెలిసిందే. వారంతా వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గతంలోనే ప్రకటించింది. అయినప్పటికీ దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందుస్తు జాగ్రత్త చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగా బహిరంగ ప్రదేశాలకు వచ్చిన్నప్పుడు ప్రజలంతా మాస్క్లు ధరించేలా ప్రజల్లో చైతన్యం కలిగిస్తంది.
హైదరాబాద్ లోనూ నో మాస్క్ నో ప్రెటోల్ రూల్:
మరోవైపు హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ముషీరాబాద్, అంబర్పేట నియోజకవర్గాల్లో పలు పెట్రోల్బంక్ల దగ్గర కొత్త నిబంధనలను అమలు చేస్తున్నారు. మాస్క్ ధరించి వస్తేనే పెట్రోల్ పోస్తామని పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పెట్రోల్ బంక్లకు వచ్చేవారు మాస్క్లు కచ్చితంగా ధరించాలనే నిబంధనలను తాము అమలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. పలు పెట్రోల్ బంక్ల దగ్గర నో మాస్క్… నో పెట్రోల్ బోర్డులను ఏర్పాటుచేశారు. కరోనాను అరికట్టడానికి సహకరించాలని వాహనదారులను కోరుతున్నారు.