AAP Bhagwant Mann : భగత్ సింగ్ పుట్టిన గ్రామంలోనే సీఎంగా ప్రమాణం చేస్తా.. రాజ్ భవన్లో కాదు..!
AAP Bhagwant Mann : పంజాబ్ కాబోయే సీఎం భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సీఎంగా ప్రమాణస్వీకారం ఎప్పటిలా రాజ్ భవన్ లో చేయనన్నారు.
AAP Bhagwant Mann : పంజాబ్ కాబోయే సీఎం భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సీఎంగా ప్రమాణస్వీకారం ఎప్పటిలా రాజ్ భవన్ లో చేయనని స్పష్టం చేశారు. భగత్ సింగ్ పుట్టిన ఖత్కర్ కాట్లో భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో భగత్ సింగ్.. అంబేద్కర్ ఫొటోలు మాత్రమే ఉంటాయని భగవంత్ మాన్ తెలిపారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఇకపై ముఖ్యమంత్రుల ఫొటోలు ఉండవన్నారు. వాటి స్థానంలో స్వాతంత్ర సమరయోధుల ఫొటోలు ఉంటాయని భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుతానని భగవంత్ మాన్ వెల్లడించారు.
సీఎంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి తేదీని త్వరలోనే ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. ఆ పార్టీ సీఎం అభ్యర్థి భగ్వంత్ మాన్ ధురీ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 58 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో భగవంత్ మాన్ విజయం సాధించారు. ఆప్ పార్టీ విజయం సాధించడంతో పంజాబ్లో నేతల్లో జోష్ నెలకొంది. ఈ సందర్భంగా భగ్వంత్ మాన్ తన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆప్ కు చారిత్రక విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలందరికి అభినందనలు తెలియజేశారు.
ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసమే పని చేస్తుందని భగవంత్ మాన్ చెప్పారు. ఆప్కు ఓటు వేయని పంజాబ్ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో అందరూ ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాల్లో విద్యాలయాలు, వైద్య మౌలిక సదుపాయాలను కల్పించేలా చర్యలు చేపడుతామని అన్నారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా ఉండేందుకు అవసరమైన చర్యలను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రానికి పలు పరిశ్రమలను తీసుకొస్తామన్నారు. అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగాణాలను, స్టేడియంలను ఏర్పాటు చేస్తామని భగవంత్ మాన్ తెలిపారు.
పంజాబ్ రాష్ట్రంలో మొత్తం 117 స్థానాలు ఉండగా.. అసెంబ్లీకి ఫిబ్రవరి 20న పోలింగ్ జరిగింది. గురువారం ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో విజయం సాధించింది. పంజాబ్ రాష్ట్రంలో ఇప్పటి వరకూ కాంగ్రెస్ మాత్రమే అధికారంలో ఉంది. ఈసారి పంజాబ్ ప్రజలు కాంగ్రెస్ కు బదులుగా ఆప్ కు పట్టం కట్టారు. బీజేపీ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాత్మక అడుగులతో పంజాబ్ ప్రజల విశ్వాసాన్ని పెంచుకుంది. ఆ కారణంగానే కేజ్రీవాల్ పార్టీని పంజాబ్ ప్రజలు స్వాగతించారు.
Read Also : Punjab : పంజాబ్కా షాన్.. పంజాబ్కా షేర్.. హాస్యనటుడు నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం