Airtel 5G Plus : దేశవ్యాప్తంగా 3వేల నగరాల్లోకి ఎయిర్టెల్ 5G ప్లస్ సర్వీసులు.. 5G ప్లాన్ల ఫుల్ లిస్టు ఇదిగో.. ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసా?
Airtel 5G Plus Plans : రిలయన్స్ జియో తర్వాత ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా 5G ప్లస్ సర్వీసులను విస్తరిస్తోంది. ఇప్పటికే ఎయిర్టెల్ 5G ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్ 5G ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?
Airtel 5G Plus Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) కంపెనీ 5G సర్వీసులను క్రమంగా విస్తరిస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా 3వేల నగరాల్లో 5G సర్వీసులను విస్తరించినట్టు ప్రకటించింది. ఎయిర్టెల్ (Airtel 5G Plus) పేరుతో టెల్కో 5వ జనరేషన్ నెట్వర్క్ కనెక్టివిటీని అందిస్తోంది. ఎయిర్టెల్ తమ వినియోగదారులకు 5G సర్వీసులను జమ్మూలోని కత్రా నుంచి కేరళలోని కన్నూర్ వరకు, బీహార్లోని పాట్నా నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్లోని ఇటానగర్ కేంద్రపాలిత ప్రాంతం డామన్ నుంచి డయ్యూ వరకు అందిస్తోంది. దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లోనూ ఇతర గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎయిర్టెల్ 5G ప్లస్ సర్వీసులను విస్తరిస్తోంది.
ఎయిర్టెల్ అందించే 5G నెట్వర్క్ ఉన్న ప్రాంతంలోని ఏ ఎయిర్టెల్ యూజర్ అయినా 5G కనెక్టివిటీని యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ, రిలయన్స్ జియో (Reliance Jio) ఇన్విటేషన్ (Welcome Offer) ఆధారంగా 5G కనెక్టివిటీని అందిస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎయిర్టెల్, జియో మాత్రమే 5G సర్వీసులను అందిస్తున్నాయి. రాబోయే రోజుల్లో డిసెంబర్ 2023 నాటికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఎయిర్టెల్ 5G ప్లస్ కవరేజీని విస్తరించాలని కంపెనీ భావిస్తోంది.
ఇటీవల భారతీ ఎయిర్టెల్ CTO రణ్దీప్ సెఖోన్ మాట్లాడుతూ.. ‘మేము 5Gతో దేశంలోని ప్రధాన ప్రాంతాలను కవర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 2023 నాటికి భారత్లోని ప్రతి పట్టణం, కీలకమైన గ్రామీణ ప్రాంతాలకు 5G సర్వీసులను విస్తరించడమే లక్ష్యం. ప్రతిరోజూ 30-40 నగరాలు/పట్టణాలు సహా గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లలో 5Gని వేగంగా అందించేందుకు కృషి చేస్తున్నాం. ఎయిర్టెల్ 5G ప్లస్ నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ కనెక్టివిటీకి మరింత శక్తినిచ్చే ప్రొపెల్లర్గా పని చేస్తుంది. వ్యాపారాలతో పాటు విద్య, ఆరోగ్య సంరక్షణ, తయారీ వంటి పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుంది’ అని సీటీఓ రణ్దీప్ పేర్కొన్నారు.
Airtel 5G ప్లస్ ప్లాన్స్ ఇవే :
ఎయిర్టెల్ 5G సర్వీసుల్లో ఎలాంటి ప్రత్యేక ప్లాన్ను అందించలేదు. కానీ, ఎయిర్టెల్ రూ. 239, అంతకంటే ఎక్కువ డేటా ప్లాన్తో అన్లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. 5G అందుబాటులో ఉన్న నగరాల్లోని ఎయిర్టెల్ యూజర్లు ఈ యాక్టివ్ ప్రీపెయిడ్ ప్యాక్లలో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. రోజువారీ డేటా క్యాప్ విషయంలో ఆందోళన అక్కర్లేదు. ప్రతిరోజూ అన్లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. రూ. 239, రూ. 265, రూ. 296, రూ. 299, రూ. 319, రూ. 359, రూ. 399 , రూ.455, రూ. 479, రూ. 489, రూ. 499, రూ. 509, రూ. 519, రూ. 549, రూ. 666, రూ. 699, రూ. 719, రూ. 779, రూ. 839, రూ. 999, రూ. 1799, రూ. 2959 వంటి ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ ప్లాన్లపై అన్లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తోంది. ఎయిర్టెల్ పోస్టుపెయిడ్ ప్లాన్లలో రూ. 399, రూ. 499, రూ. 599, రూ. 999, రూ. 1199, రూ. 1499 ఉన్నాయి. అన్లిమిటెడ్ 5G యాక్సెస్తో పాటు.. ఈ ప్లాన్లలో అన్లిమిటెడ్ కాలింగ్, SMS వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. రూ. 499, రూ. 1499 మధ్య ప్లాన్లలో అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్స్టార్లకు ఫ్రీగా మెంబర్షిప్ కూడా అందిస్తోంది.
ఎయిర్టెల్ 5G Plus ఎలా యాక్టివేట్ చేయాలంటే? :
మీ ఫోన్లో (Airtel 5G) ప్లస్ని యాక్టివేట్ చేసేందుకు Settings > Network and Connectivity > Airtel SIM > Enable 5G ఆప్షన్ ఎంచుకోండి. మీరు (Airtel Thanks) యాప్ని ఉపయోగించి మీ ప్రాంతంలో 5G అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ స్టోర్లలో 5G ఎక్స్పీరియన్స్ జోన్లను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికీ 5G అందుబాటులో లేని వినియోగదారులు ఏదైనా ఎయిర్టెల్ స్టోర్ని విజిట్ చేయండి. తద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ను పొందవచ్చు. Airtel 5G ప్లస్ గురించి మరింత సమాచారం కావాలంటే.. airtel.in/5g-networkని విజిట్ చేయండి.