Chevella Lok Sabha Constituency : చెమట్లు పట్టిస్తోన్న చేవెళ్ల పార్లమెంట్ రాజకీయం…ట్రయాంగిల్ ఫైట్ తప్పదా ?
పరిగిలో.. కొప్పుల మహేశ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మహేష్కు ఇంటిపోరు తప్పదనే చర్చ జరుగుతోంది. తన సోదరుడు అనిల్ రెడ్డి.. రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ పెద్దల ముందు ఈ విషయాన్ని విన్నవించినట్లు తెలుస్తోంది.
Chevella Lok Sabha Constituency : హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉండే లోక్సభ నియోజకవర్గం చేవెళ్ల. పట్టణ, గ్రామీణ ప్రాంతం కలిసి ఉండే ఈ నియోజకవర్గంలో… గులాబీ పార్టీ వరుసగా రెండుసార్లు జెండా ఎగురవేసింది. మూడోసారి కూడా జోరు కొనసాగించాలనే వ్యూహంలో.. బీఆర్ఎస్ ఉంది. అసెంబ్లీలను క్లీన్స్వీప్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. మరి చేవెళ్ల పాలిటిక్స్ ఏం చెప్తున్నాయ్. పట్నం ఫ్యామిలీ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది.. తాండూరులో మహేందర్ రెడ్డికి టికెట్ దక్కుతుందా.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీకి కొండంత బలంగా మారుతారా.. లోక్సభ పరిధిలో కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్. ఇక్కడ బీఆర్ఎస్ వెంటాడుతోన్న టెన్షన్ ఏంటి.. బీజేపీ, కాంగ్రెస్ బలహీనతలు ఏంటి..
చేవెళ్ళ పార్లమెంట్ స్థానంలో గులాబీ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందా?
తెలంగాణలో ఆసక్తి పోరు జరిగే ప్రాంతాల్లో చేవెళ్ల పార్లమెంట్ స్థానం ఒకటి. అటు తెలంగాణ ప్రాంత ప్రజలు… ఇటు ఏపీ నుంచి వచ్చి సెటిలైన వాళ్లు ఎక్కువ ఉన్న ప్రాంతం. ఇక్కడ రాజకీయం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగానే మారుతుంది. ఇక ఈసారి ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో త్రిముఖ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. జరిగిన రెండు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. 2014లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019 ఎన్నికల్లో గడ్డం రంజిత్ రెడ్డి గెలుపొందారు. గత రెండు ఎన్నికల్లోనూ రాజకీయంగా అనుభవం లేని నేతలను రంగంలోకి దింపి గెలిపించుకోవడంతో.. చేవెళ్లపై గులాబీబాస్కు గురి కుదిరింది. మొదటిసారిగా 2014లో ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కారు దిగి… 2019లో కాంగ్రెస్ తరఫున బరిలో దిగారు. కొండా ఇప్పుడు కమలం గూటికి చేరుకున్నారు. దీంతో ఈసారి ఎన్నికల యుద్ధం ఆసక్తిగా మారే అవకాశాలు ఉన్నాయ్.
బీజేపీ తరఫున కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేసే చాన్స్, కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకునే పనిలో కాంగ్రెస్…
చేవేళ్ల పార్లమెంట్లో గడ్డం రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మళ్లీ ఆయనే గులాబీ పార్టీ తరఫున రంజిత్ రెడ్డి బరిలో దిగడం ప్రస్తుతానికి దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఐతే ఆయన అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కేసీఆర్ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఆ తర్వాత పరిణామాలతో కమలం తీర్థం పుచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆయనే పార్లమెంట్ బరిలో నిలవడం దాదాపు కన్ఫార్మ్. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కార్తిక్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి.. ఇప్పుడు హస్తానికి దూరం అయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. నగరానికి అనుకుని ఉన్న నియోజకవర్గం కావడం….. రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్తో చాలామంది బడా వ్యాపారులు ప్రధాన పార్టీల నుంచి బరిలో దిగేందుకు పోటీ పడుతున్నారు.
READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో చేవెళ్ల అసెంబ్లీతో పాటు.. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పరిగి, వికారాబాద్, తాండూరు సెగ్మెంట్లు ఉన్నాయ్. ఇందులో చేవెళ్ల, వికారాబాద్.. ఎస్సీ రిజర్వ్డ్ కాగా.. మిగిలినవి జనరల్.. ఏడు అసెంబ్లీలు కూడా గులాబీ పార్టీ ఖాతాలో ఉన్నాయ్. ఐతే చాలా నియోజకవర్గాల్లో వర్గపోరు గులాబీ పార్టీని టెన్షన్ పెడుతోంది.
మహేశ్వరం లో తీగల కృష్ణారెడ్డికి, సబితకు మధ్య వార్,….బీజేపీ నుంచి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ బరిలోకి దిగే ఛాన్స్
మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా.. ఆ తర్వాత గులాబీతీర్థం పుచ్చుకున్నారు. ఐతే గులాబీ పార్టీ నుంచి పోటీ చేసిన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. దీంతో పార్టీలో గ్రూప్వార్ మొదలైంది. సబితా ఇంద్రారెడ్డిపై తీగల వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన తన అనుచరులకే సబిత ప్రాధాన్యత ఇస్తున్నారని.. గులాబీ పార్టీ నేతల ఆరోపణ. సిట్టింగ్లకే మరోసారి టికెట్లు అని కేసీఆర్ ప్రకటించారు. మరి సబితకు మళ్లీ అవకాశం ఇస్తారా.. మహేశ్వరంలో రాజకీయం దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు.. ఎంపీ రంజిత్ రెడ్డికి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారా అనే డిస్కషన్ నడుస్తోంది. కమలం పార్టీ నంచి మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. టికెట్ ఫైట్లో రాములు యాదవ్ పేరు కూడా వినిపిస్తున్నా.. వీరేందర్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయ్. కాంగ్రెస్ నుంచి బండగ్ పేట మేయర్గా ఉన్న పారిజాత నర్సింహారెడ్డి టికెట్ ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్లో చోటుచేసుకునే పరిణామాల ఆధారంగా.. ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేసే చాన్స్ ఉంది. ప్రస్తుతం గులాబీ పార్టీలో ఉన్న తీగల.. హస్తం గూటికి చేరుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. అదే జరిగితే.. ఆయనకే కాంగ్రెస్ టికెట్ దక్కడం ఖాయం.
READ ALSO : Kammam Politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణా రాజకీయం… గులాబీ పార్టీలో గ్రూపుల గుబులు
రాజేంద్రనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రకాశ్ గౌడ్ కు తిరిగి సీటు దక్కేనా?
రాజేంద్రనగర్లో ప్రకాశ్ గౌడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించారు ప్రకాశ్ గౌడ్. మంత్రి సబితతో ఆయనకు విబేధాలు ఉన్నాయ్. నియోజకవర్గంలో సబిత జోక్యం చేసుకుంటున్నారని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నారు. సబిత తనయుడు కార్తిక్ రెడ్డి… తన పాత పరిచయాలతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అనుచరవర్గాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇక ఇక్కడినుంచి కొత్త అభ్యర్థిని బీఆర్ఎస్ బరిలోకి దింపే ప్రయత్నం చేస్తుందన్న ప్రచారం పాలిటిక్స్ను మరింత వేడెక్కిస్తోంది. తాండూరు నుంచి పోటీకి పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం దక్కపోతే.. ఆయనను కొడంగల్ బరిలో దింప.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని రాజేంద్రనగర్లో పోటీ చేయించే చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ రంజిత్ రెడ్డి కూడా మహేశ్వరం లేదా రాజేంద్రనగర్ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పార్టీ పెద్దల ముందు ప్రతిపాదనలు కూడా ఉంచారు. దీంతో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనేది ఆసక్తి రేపుతోంది. బీసీ ఫ్యాక్టర్ ప్రకాశ్ గౌడ్కు కలిసొచ్చే అంశం. రాజేంద్రనగర్లో బీఆర్ఎస్కు బలమైన కేడర్ ఉన్నా.. ఎంఐఎం ప్రభావం కూడా ఎక్కువే! గత ఎన్నికల్లో 46వేలకు పైగా ఓట్లు సాధించిన ఎంఐఎం.. ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతోంది. ప్రకాశ్ గౌడ్తో విభేదించిన కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డిని తమ గూటికి చేర్చుకున్న బీజేపీ.. ఆయనను ఎన్నికల బరిలో దింపే ఆలోచన చేస్తోంది. దీంతో శ్రీనివాస్ రెడ్డి కూడా ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ నుంచి జ్జానేశ్వర్ ముదిరాజ్తో పాటు ముంగి జైపాల్ రెడ్డి పేర్లు టికెట్ రేసులో వినిపిస్తన్నాయ్. ఎవరిని నిలబెట్టినా సరే పోటీ ఇచ్చే స్థాయి ఉన్న నేతలు ప్రతిపక్ష పార్టీల్లో కనిపించకపోవడం.. అధికార పార్టీకి ఇక్కడ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయ్.
READ ALSO : Adilabad Lok Sabha Constituency : రాజకీయాలకు అడ్డాగా కుమ్రం భీమ్ పోరుగడ్డ… అదిలాబాద్ పై కన్నేసిన కమలం
శేరిలింగంపల్లిలో అరికపూడి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసే చాన్స్…
శేరిలింగంపల్లికి.. హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు ఉంది. అరికపూడి గాంధీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అతిపెద్ద నియోజకవర్గం కావడం, హైటెక్ సిటీగా ఈ ప్రాంతానికి ఉన్న గుర్తింపుతో… నియోజకవర్గంలో సిట్టింగ్ కార్పొరేటర్లు టికెట్ కోసం పోటీపడుతున్నారు. కేసీఆర్ ప్రకటన, రాజకీయ సమీకరణాలతో అరికపూడి గాంధీ.. మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన యోగానంద్తో పాటు.. ఈ మధ్యే కమలం తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తనయుడు రవికుమార్ యాదవ్ టికెట్ రేసులో ఉన్నారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే.. రవికుమార్కు అభ్యర్తిత్వం దాదాపు ఖరారయ్యే చాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. గతంలో టీడీపీ తరఫున పోటీ చేసిన మొవ్వ సత్యనారాయణ కూడా ఈసారి కమలం పార్టీ తఫున టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి కొత్త అభ్యర్థి బరిలో కనిపించే అవకాశాలు ఉన్నాయ్. ఎన్నికల నాటికి మారే రాజకీయ పరిణామాల ఆధారంగా.. ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. బలమైన నేత కోసం హస్తం పార్టీ పెద్దలు అన్వేషణ మొదలుపెట్టారు.
111జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం చేవెళ్ల లో గులాబీ పార్టీకి కలిసొచ్చే ఛాన్స్…
చేవెళ్ల అసెంబ్లీలో కాలే యాదయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం నుంచి టికెట్ విషయంలో ఆయనకు గట్టి పోటీ కనిపిస్తోంది. యాదయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితులు అనే పేరు ఉంది. 111జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇక్కడ గులాబీ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఐతే అదే సమయంలో రకరకాల లుకలుకలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయ్. రియల్ వివాదాల్లో పార్టీ నేతలు తల దూరుస్తుండడం.. బీర్ఎస్కు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో పాటు.. సిట్టింగ్ ఎమ్మెల్యే యాదయ్య మీద కూడా ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయ్. వివాదరహితుడిగా ఉన్న యాదయ్యపై పార్టీ హైకమాండ్ సానుకూలంగా ఉన్నా… సర్వేలు, అప్పటి రాజకీయ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి టికెట్ దక్కపోతే.. కేఎస్ రత్నం కారు దిగొచ్చనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్. బీజేపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన కంజర్ల ప్రకాశ్.. మరోసారి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయ్. ఆపరేషన్ ఆకర్ష్ ఫలితాల మీదే ప్రకాశ్కు టికెట్ దక్కుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది.
మెతుకు ఆనంద్ కే వికారాబాద్ లో మరోసారి ఛాన్స్….
వికారాబాద్లో మెతుకు ఆనంద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకే మరోసారి టికెట్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో పాటు.. జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డితో పొసగకపోవడం ఆయనకు రాజకీయంగా కొత్త సమస్యలను సృష్టిస్తోంది. ఆ ఇద్దరితో విబేధాల కారణంగా నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆనంద్. ఇదే సమయంలో తన మార్క్ రాజకీయం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ప్రవీణ్ కుమార్కు.. ఆనంద్ స్వయంగా బావ. దీంతో చాలామందిలో రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయ్. ఆనంద్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చినా.. ఈ ప్రచారానికి మాత్రం బ్రేక్ పడడం లేదు. బీజేపీ తరఫున మాజీ మంత్రి చంద్రశేఖర్ పోటీకి సిద్ధం అవుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి విజయం సాధించి తీరాలని.. నియోజకవర్గంలో తన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. మరో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్… కాంగ్రెస్ నుంచి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో సంబంధాలు… సిట్టింగ్ ఎమ్మెల్యేకు బలం, బలహీనతగా మారే చాన్స్ ఉందనే చర్చ నడుస్తోంది. ఎన్నికల నాటికి రాజకీయంగా ఎలాంటి పరిణామాలకైన దారి తీయొచ్చనే చర్చ జరుగుతోంది.
తాండూరు పైలట్, పట్నం మధ్య ఆధిపత్య పోరు….పార్టీ మారి అయినా సరే పోటీ చేసేందుకు మహేందర్ రెడ్డి రెడీ!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఆధిపత్య పోరుకు పరాకాష్ట.. తాండూరు నియోజకవర్గం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. పైలట్ రోహిత్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పైలట్తో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి… ఎవరికివారే నియోజకవర్గంలో పట్టుకోసం పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత పైలట్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి వర్గాలుగా విడిపోయింది పార్టీ ఇక్కడ ! ఇద్దరి మద్య ఆధిపత్యపోరుకు బ్రేక్ వేసేందుకు గులాబీ పెద్దలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నా.. పరిస్థితి మారడం లేదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కపోతే… పార్టీ మారి అయినా సరే పోటీ చేసేందుకు మహేందర్ రెడ్డి రెడీ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీలో చేరాలన్న దానిపై కూడా సన్నిహితులతో.. ఆయన చర్చలు జరుపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. తన రాజకీయ అనుభవంతో తాండూరుతో పాటు.. చేవేళ్ల ఎంపీ పరిధిలోని మిగిలిన ఆరు అసెంబ్లీలకు తాను సూచించిన నేతలకు ఇవ్వాలని పట్నం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్, కేటీఆర్తో ఉన్న సంబంధాల కారణంగా ప్రస్తుతానికి సైలెంట్ గా పట్నం…
కేసీఆర్, కేటీఆర్తో ఉన్న సంబంధాల కారణంగా ప్రస్తుతానికి సైలెంట్గానే ఉన్నా…. టికెట్ దక్కకపోతే తర్వాత కార్యాచరణ అమలుచేయాలన్న ఆలోచనలో పట్నం మహేందర్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సోదరుడైన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా.. అన్న తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా నడిచే చాన్స్ ఉంది. దీంతో మహేందర్ రెడ్డి విషయంలో గులాబీ పార్టీ ఆచీతూచీ అడుగులు వేస్తోంది. తాండూరు రాజకీయ పరిణామాలు.. మిగిలిన ఆరు నియోజకవర్గాలపై కనిపించకుండా గులాబీ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోంది. పట్నం మహేంద్ రెడ్డి పార్టీ మారితే.. టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధంగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. బలమైన అభ్యర్థులు లేకపోవడంతో.. ఆ రెండు పార్టీలు పట్నం కుటుంబంపై ఆశలు పెంచుకున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇక అటు మహేందర్ రెడ్డికి అనుచరులుగా ఉన్న కీలక నేతలను.. పైలట్ రోహిత్ రెడ్డి తన వైపు తిప్పుకున్నారు. ఫాంహౌస్ ఎపిసోడ్ తర్వాత కేసిఆర్తో పెరిగిన సాన్నిహిత్యంతో.. నియోజకవర్గానికి అభివృద్ధి కోసం భారీగా నిధులు మంజూరు చేయించుకున్నారు. పైలట్ ఇక్కడ నుంచి మరోసారి బరిలోదిగడం ఖాయంగానే కనిపిస్తున్నా.. పట్నం కుటుంబం తీసుకునే నిర్ణయం ఆధారంగానే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కానున్నారు.
పరిగిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డికి ఇంటిపోరు తప్పదా…టికెట్ కోసం మహేశ్ సోదరుడు అనిల్ ప్రయత్నాలు
పరిగిలో.. కొప్పుల మహేశ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మహేష్కు ఇంటిపోరు తప్పదనే చర్చ జరుగుతోంది. తన సోదరుడు అనిల్ రెడ్డి.. రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ పెద్దల ముందు ఈ విషయాన్ని విన్నవించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై కొప్పుల కుటుంబంలో తరచూ చర్చలు జరుగుతుండడం…. అవి బయట పడుతుండడం రాజకీయంగా మహేశ్ రెడ్డికి బ్రేకులు వేస్తున్నాయ్. అటు పట్నం మహేందర్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న.. డీసీసీబీ చైర్మన్ బుయ్యాని మనోహర్ రెడ్డి కూడా నియోజకవర్గంలో జోరుగా పర్యటనలు చేస్తున్నారు. తనకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఆర్ధికంగా బలంగా ఉండంతో మనోహర్ రెడ్డి… ఎన్నికల నాటికి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుందామన్న అభిప్రాయాన్ని సన్నిహితులతో వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. పట్నం నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాలా.. కాషాయం తీర్థం పుచ్చుకోవాలా అన్న యోచనలో మనోహర్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి నియోజవర్గంలోని రెండు మండలాల్లో పట్టు ఉంది. మనోహర్ రెడ్డిలాంటి నేతలు పార్టీలో చేరితే.. నియోజకవర్గంపై పట్టు సాధించవచ్చని కమలం పార్టీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన రాంమోహన్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.