Chinna Jeeyar Swamy : రామానుజ విగ్రహావిష్కరణకు రావాలని పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించిన చిన్న జీయర్ స్వామి
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డితో సహా ...
Chinna Jeeyar Swamy : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డితో సహా పలువురిని ఆహ్వానించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీ. ఢిల్లీలో వారిని స్వయంగా కలిసి ఆహ్వానపత్రం అందించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ముచ్చింతల్లోని శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామీజీ ఆశ్రమంలో అతిపెద్ద సమతామూర్తి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. 200 ఎకరాల్లో వేయి కోట్లతో రామానుజ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా 1,035 హోమ గుండాలతో ప్రత్యేక యాగం నిర్వహించనున్నారు. 2022 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. 216 అడుగుల పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రావాలంటూ పలువురు కేంద్రమంత్రులను ఆహ్వానించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మై హోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు.
ఇందులో భాగంగా ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణాశాఖమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన శ్రీశ్రీశ్రీ త్రిదండ్రి చిన్నజీయర్ స్వామి సమతా మూర్తి విశిష్టతను గడ్కరీకి వివరించారు. అటు కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిసిన చిన్నజీయర్ స్వామి దివ్యసాకేతానికి రావాలని ఆహ్వానించారు. రామానుజ విగ్రహ ఆవిష్కరణ ఆహ్వాన పత్రాన్ని కిషన్ రెడ్డికి స్వయంగా అందించారు. సమతామూర్తి విగ్రహ ఏర్పాటు ద్వారా… వారి బోధనలు, సందేశం ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంటుందన్నారు చిన్నజీయర్ స్వామీజీ.
అనంతరం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విన్ చౌబెను కలుసుకున్నారు చిన్నజీయర్ స్వామి, మైంహోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు. రామానాజాచార్య విశిష్టతను ఆయనకు వివరించారు. 120 ఏళ్ల పాటు జీవించిన భగవత్ రామానుజాచార్య.. ప్రజలంతా కులమతవర్గ విబేధాలు లేకుండా జీవించేందుకు దేశమంతా పర్యటించారని చెప్పారు. ఫిబ్రవరిలో నిర్వహించే విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి రావాలని ఆహ్వానించారు.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజేకు కూడా చిన్నజీయర్ స్వామి ఆహ్వాన పత్రాన్నిఅందించారు. ఆశ్రమంలో నిర్మిస్తున్న సమతామూర్తి ప్రాధాన్యతను తెలియజేశారు. శోభ కరంద్లాజేకు స్వామివారు మంగళ శాసనాలను అందించారు. భగవత్ రామానుజాచార్య విగ్రహ ఆవిష్కరణకు రావాలంటూ ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కూడా ఆహ్వానాలందించారు చిన్నజీయర్ స్వామీజీ. చిన్న జీయర్ స్వామి వెంట మై హోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు,మై హోం గ్రూప్ డైరెక్టర్ జూపల్లి రంజిత్ కూడా ఉన్నారు.