Covid-19 compensation: కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం..60 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు : సుప్రీంకోర్టు
కోవిడ్-19తో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సహాయానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది.
Covid-19 compensation : కోవిడ్-19తో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సహాయానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. కోవిడ్ పరిహారం పొందటానికి దరఖాస్తు చేసుకునేందుకు నిర్ణీత గడువు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 20వ తేదీకి ముందు కొవిడ్ మరణాలకు సంబంధించి 60 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడింది.
భవిష్యత్తులో చోటుచేసుకునే కొవిడ్ మరణాలకు మాత్రం బాధిత కుటుంబాలకు 90 రోజుల్లోగా దరఖాస్తుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొవిడ్తో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుంటుంబాలు పరిహారం పొందే విషయంపై మార్చి 24న సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
కొవిడ్ పరిహారం కోసం బాధిత కుటుంబాలకు నెల రోజుల గడువు ఇవ్వనున్నట్లు కేంద్రం చేసిన ప్రతిపాదన సరిపోదని సుప్రీంకోర్టు మార్చిలో అభిప్రాయపడింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన విషాదం నుంచి బాధితులు కోలుకొని, పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమయం పడుతుందని తెలిపింది.
మార్చి 20తేదీకి ముందు జరిగిన కొవిడ్ మరణాలకు 60 రోజుల గడువు, భవిష్యత్తులో సంభవించే వాటికి 90 రోజుల గడువు ఇవ్వాలని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నల ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. మరోవైపు పరిహారం కోసం వచ్చే నకిలీ అభ్యర్థనలను గుర్తించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ చర్చలు చేపట్టాలని సూచించింది.