Odisha CM Convoy : ఒడిషా సీఎం కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్ పై భారతీయ జనతా యువ మోర్చా(BJYM) కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. బుధవారం పూరీలో
Odisha CM Convoy ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్ పై భారతీయ జనతా యువ మోర్చా(BJYM) కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. బుధవారం పూరీలో రూ.331 కోట్ల శ్రీ జగన్నాథ్ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పట్నాయక్.. భువనేశ్వర్కు తిరిగి వెళ్తుండగా దర్జీపోఖారీ ఛక్ వద్ద ఈ ఘటన జరిగింది. కలహండి ఉపాధ్యాయురాలి కిడ్నాప్, హత్య కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూరీలో నిరసన చేపట్టిన బీజేవైఎం కార్యకర్తలు..అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని వెళ్లి అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్పైకి కోడిగుడ్లు విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీఎం కాన్యాయ్పై కోడిగుడ్ల దాడి చేసింది తామేనని బీజేవైఎం ఒడిశా అధ్యక్షుడు ఇరాసిస్ ఆచార్య తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా నిరసన తెలుపుతుంటామన్నారు. కలహండి ఉపాధ్యాయురాలు కిడ్నాప్, హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి దిబ్య శంకర్ను కేబినెట్ నుంచి తొలగించే వరకు ఇదే తరహాలో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కాగా,కలహండి ఉపాధ్యాయురాలు కిడ్నాప్, హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి డీఎస్ మిశ్రాను తొలగించాలని కొన్ని వారాలుగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మహిళా టీచర్ మమతా మెహర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు గోబింద సాహుతో శంకర్ మిశ్రా సంబంధాలున్నాయని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మంత్రుల వాహనాలపై కోడిగుడ్ల దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే బుధవారం(నవంబర్-24,2021)బీజేవైఎం కార్యకర్తలు పూరీలో ప్రభుత్వం తీరుకు నిరసనగా కొందరు ఆందోళనలు చేపట్టారు. నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేశారు. జగన్నాథ ఆలయం ముందు ఉన్న గ్రాండ్ రోడ్పై పేడనీటిని చల్లి శుద్ధి చేశారు. అక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ‘కళంకిత రాష్ట్ర మంత్రులు’ పవిత్ర మార్గాన్ని అపవిత్రం చేశారని వ్యాఖ్యానించారు.