Electric Scooter : తప్పిన ప్రమాదం-పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ
విద్యుత్ స్కూటీకీ చార్జింగ్ పెట్టగా.. అది పేలి అగ్నిప్రమాదం జరిగిన ఘటన హైదరాబాద్ చింతల్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
Electric Scooter : విద్యుత్ స్కూటీకీ చార్జింగ్ పెట్టగా.. అది పేలి అగ్నిప్రమాదం జరిగిన ఘటన హైదరాబాద్ చింతల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దేశంలో వాయు కాలుష్యం నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహానాల తయారీ వినియోగం ఊపందుకుంది. ద్విచక్రవాహానాలు మొదలు కార్లు, బస్సులు రోడ్లమీద రఁయ్ రఁయ్ మని దూసుకుపోతున్నాయి.
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సమీపంలోని చింతల్ భగత్సింగ్ నగర్ కు చెందిన సాయి కుమార్ రెడ్డి అనే వ్యక్తి సేల్స్ మెన్ గా పని చేస్తుంటాడు. పెరుగుతున్నపెట్రోల్ రేట్లు భరించలేక అతను ఎలక్ట్రిక్ స్కూటర్ ను రోజు వారీ అద్దెకు తీసుకుని నడుపుకుంటున్నాడు. అందుకు రోజుకు రూ. 150 అద్దె చెల్లిస్తున్నాడు. ప్రతిరోజూ రాత్రి పూట బ్యాటరీని స్కూటీనుంచి వేరు చేసి ఇంట్లో చార్జింగ్ పెట్టుకునేవాడు.
రోజూ లాగానే గత రాత్రి బ్యాటరీ చార్జింగ్ పెట్టి పడుకున్నాడు. తెల్లవారు ఝామున 3 గంటల సమయంలో వాసన వస్తూ ఉండటంతో మెలుకువ వచ్చి చూడగా… బ్యాటరీలోంచి పొగలు రావటం మొదలయ్యింది. పక్క గదిలో ఉన్న కరెంట్ స్విఛ్చాఫ్ చేసేందుకు లేచి వెళ్లే లోగా బ్యాటరీ పేలింది.
Also Read : Siddipet 42 Lakhs Loot Case : 48 గంటలు గడిచినా దొరకని రూ.42 లక్షల చోరీ కేసు నిందితులు
దీంతో ఇంట్లోని బట్టలు, ఫోన్, మంచం ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. మంటల ధాటికి ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలను ఆర్పేశారు. బ్యాటరీ పేలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పినట్టయింది.