‘G8’ Chief Ministers: అందుకే జీ8 ముఖ్యమంత్రుల ఫోరాన్ని ఏర్పాటు చేస్తున్నా: కేజ్రీవాల్
లోక్ సభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగాల్సి ఉండడంతో పలు విపక్ష పార్టీల నేతలు కూటములపై దృష్టి పెట్టారు. కేజ్రీవాల్ కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారు.
‘G8’ Chief Ministers: దేశంలో తాను ఏర్పాటు చేస్తోన్న బీజేపీ-కాంగ్రెస్ యేతర జీ8 ముఖ్యమంత్రుల (‘G8’ Chief Ministers) ఫోరం మంచి పరిపాలన కోసమేనని, రాజకీయాల కోసం కాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చెప్పారు. ఈ నెల 18న జీ8 ముఖ్యమంత్రుల సమావేశం జరగాల్సి ఉండగా, అది వాయిదాపడింది. తాజాగా, జీ8 ముఖ్యమంత్రుల గురించి కేజ్రీవాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
జీ8 ముఖ్యమంత్రుల ఫోరం విషయంలో ఇప్పటికే పలు సమావేశాల్లో పాల్గొన్నానని కేజ్రీవాల్ చెప్పారు. తమ సమావేశం తేదీని నిర్ణయించడానికి ముఖ్యమంత్రులకు లేఖలు రాశానని తెలిపారు. ఈ నెల 18, 19న వారు చాలా బిజీగా ఉన్నారని, కొన్ని రాష్ట్రాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పారు. ముఖ్యమంత్రుల సమావేశం ఏప్రిల్ 15లోపు జరిగే అవకాశం లేదని అన్నారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ చేస్తున్న ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ సహా మరో నలుగురితో కేజ్రీవాల్ జీ8 ముఖ్యమంత్రుల ఫోరం ఏర్పాటు చేస్తున్నారు. వారితో పలు సార్లు మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇప్పటికే బీజేపీ-కాంగ్రెస్ కి సమాన దూరం పాటిస్తూ విపక్షాల కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Indian Embassy In UK: భారత్ రియాక్షన్తో లండన్లో మారిన సీన్.. భారత ఎంబసీ ముందు టైట్ సెక్యూరిటీ