Raj Bhavan Tension : రాజ్భవన్ దగ్గర టెన్షన్ టెన్షన్.. మేయర్, బీఆర్ఎస్ నేతల ఆందోళన, బారికేడ్ల తోసివేత
రాజ్ భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజ్ భవన్ లోపలికి వెళ్లేందుకు జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పోలీసులు బారికేడ్లు పెట్టి మేయర్, కార్పొరేటర్లను అడ్డుకున్నారు. రాజ్ భవన్ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు.
Raj Bhavan Tension : రాజ్ భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజ్ భవన్ లోపలికి వెళ్లేందుకు జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పోలీసులు బారికేడ్లు పెట్టి మేయర్, కార్పొరేటర్లను అడ్డుకున్నారు. రాజ్ భవన్ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు.
గవర్నర్ కు ఇవ్వాల్సిన ఫిర్యాదు లేఖను పోలీసులకు చూపించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి.. వారితో చర్చలు జరుపుతున్నారు. అయితే, బీఆర్ఎస్ నేతలను రాజ్ భవన్ లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రాజ్ భవన్ ముందు బీఆర్ఎస్ మహిళా నేతలు బైఠాయించారు. పోలీసులు అడ్డుగా ఉంచిన బారికేడ్లను మేయర్, కార్పొరేటర్లు తోసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతల ఆందోళనలతో రాజ్ భవన్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కామెంట్స్ గురించి గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు రాజ్ భవన్ కు వెళ్లారు. అయితే, ఎలాంటి అపాయింట్ ఖరారు కాలేదని రాజ్ భవన్ వర్గాలు అంటున్నారు. కవితపై బండి సంజయ్ కవితపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు మేయర్ విజయలక్ష్మి. గవర్నర్ కూడా ఒక మహిళే అన్నారు.
ఉదయం నుంచి గవర్నర్ అపాయింట్ మెంట్ అడుగుతున్నా.. ఇవ్వలేదన్నారు. బండి సంజయ్ నోరును ఫినాయిల్ తో కడగాలన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉండి మహిళపై ఇలాంటి కామెంట్ చేయడానికి సిగ్గుండాలన్నారు. మహిళలందరికీ బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిమాండ్ చేశారు. గవర్నర్ పై బీఆర్ఎస్ నేత చేసిన కామెంట్స్ కు మేము క్షమాపణ చెప్పామని ఆమె గుర్తు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ పై భగ్గుమన్నాయి. అటు తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంజయ్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. సంజయ్ ను ఈ విషయంలో విచారించాలని రాష్ట్ర డీజీపీని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ బండి సంజయ్ కు నోలీసులు జారీ చేశారు. అంతేకాదు ఇదే అంశంపై జాతీయ మహిళా కమిషన్ కు రాష్ట్ర మహిళా కమిషన్ లేఖ రాయనుంది. మరోవైపు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో బండి సంజయ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.