New Parliament : కొత్త పార్లమెంట్‌లో రాజదండం..దాని చరిత్ర, ప్రాధాన్యత ఏంటో తెలుసా..? భారత స్వాతంత్ర్య ప్రకటనకు రాజదండానికి సంబంధమేంటీ?

ఆంగ్లేయులు పాలన ముగిసి, భారత్‌కు స్వాతంత్ర్యం ప్రకటించే ముందు మౌంట్‌బాటెన్‌, నెహ్రూకు మధ్య జరిగిన చర్చ ఈ రాజదండం ఏర్పాటుకు నాంది పలికింది. ఆ రాజదండమే ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

New Parliament  : కొత్త పార్లమెంట్‌లో రాజదండం..దాని చరిత్ర, ప్రాధాన్యత ఏంటో తెలుసా..? భారత స్వాతంత్ర్య ప్రకటనకు రాజదండానికి సంబంధమేంటీ?

Historic Sceptre 'In New Parliament

New Parliament Inauguration : మే 28,2023న భారత దేశ చరిత్రలో మరో గొప్ప కార్యక్రమం జరగబోతోంది. అదే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం. ఆదివారం ప్రారంభం కానున్న కొత్త పార్లమెంట్‌ భవనం సరికొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆ ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ప్రధాని మోదీ ఒక బంగారు రాజదండాన్ని స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. అలాగే దానికున్న చారిత్రక ప్రాధాన్యతను వెల్లడించారు. బ్రిటిషర్లు, భారతీయుల మధ్య జరిగిన అధికార బదిలీకి ఆ రాజదండం నిదర్శనమని గుర్తుచేశారు. దానిని బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్‌ లార్డ్ మౌంట్‌బాటెన్‌.. స్వతంత్ర భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అందించారు. ఆ రాజదండాన్ని సెంగోల్ అంటారు.

ఆంగ్లేయులు పాలన ముగిసి, భారత్‌కు స్వాతంత్ర్యం ప్రకటించే ముందు మౌంట్‌బాటెన్‌, నెహ్రూకు మధ్య జరిగిన చర్చ ఈ రాజదండం ఏర్పాటుకు దారితీసింది. బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికార బదిలీకి గుర్తుగా ఏం చేద్దామని మౌంట్‌ బాటెన్‌.. నెహ్రూను ప్రశ్నించారట. వెంటనే నెహ్రూ పక్కనే ఉన్న రాజగోపాలాచారిని సలహా కోరారు. అప్పుడు రాజాజీ .. తమిళ సంప్రదాయంలో ఉన్న ఒక విధానాన్ని వివరించారు. కొత్త రాజు బాధ్యతలు చేపట్టే సమయంలో ప్రధాన పూజారి దానిని ఆయనకు అందజేసే సంప్రదాయం ఉందని తెలిపారు. చోళులు దానిని అనుసరించారని వెల్లడించారు. దాంతో ఆ రాజదండాన్ని తయారు చేసే పనిని నెహ్రూ.. రాజాజీకి అప్పగించారు.

అందుకోసం రాజగోపాలాచారి.. తిరువడుత్తురై అథీనంను సంప్రదించారు. రాజదండం తయారీలో సహకరించేందుకు అంగీకరించిన మఠాధిపతులు.. మద్రాస్‌లోని స్వర్ణకారుడి చేత దానిని సిద్ధం చేయించారు. దాని పొడవు ఐదు అడుగులు ఉండగా.. పై భాగంలో నంది చిహ్నాన్ని అమర్చారు. న్యాయానికి ప్రతీకగా ఈ ఏర్పాటు చేశారు. ఆ మఠానికి చెందిన స్వామీజి ఒకరు ఆ దండాన్ని మొదట మౌంట్‌బాటెన్‌కు అందించి, దానిని తిరిగి వెనక్కి తీసుకున్నారట. ఆ తర్వాత గంగాజలంతో శుద్ధి చేసి, నెహ్రూ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారట. అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటన చేయడానికి 15 నిమిషాల ముందు దానిని భారత నూతన ప్రధానికి అందజేశారట. ఆ ప్రక్రియ జరుగుతున్నంతసేపు ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను ఆలపించారట.

ఈ రాజదండం చరిత్ర, ప్రాధాన్యత చాలామందికి తెలీదని అమిత్‌ షా అన్నారు. ప్రస్తుత ఈ ఏర్పాటు.. మన సంప్రదాయాలను, ఆధునికతకు సంధానించే ప్రయత్నమని తెలిపారు. ఇది మోదీ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం ఇది అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంది. దీనిని ఆదివారం కొత్త పార్లమెంట్‌ భవనంలో అమర్చనున్నారు.