Electric Cars : ఎలక్ట్రిక్ కార్లతో పర్యావరణ ముప్పు.. కాన్పూర్ ఐఐటీ వెల్లడి
ఎలక్ట్రిక్ కార్ల తయారీ, వినియోగం, వాటిని తుక్కుగా మార్చే ప్రక్రియను సంప్రదాయ, హైబ్రిడ్ కార్లతో పోల్చి 15 నుంచి 50 శాతం ఎక్కువ గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయని ఐఐటీ కాన్పూర్ కు చెందిన ఇంజిన్ రిసెర్చ్ ల్యాబ్ వెల్లడించింది.
Electric Cars- IIT Kanpur : రోడ్లపై ఇటీవల ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) కనిపిస్తున్నాయి. నిర్వహణ ఖర్చు తక్కువ కావడం, పెట్రోల్ తో పనిలేకుండా ఇంట్లోనే చార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉండడం, ఎంత దూరమైనా చవకగా ప్రయాణించే వెసులుబాటు ఉండడంతో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు కూడా ఈవీలపై అవగాహన కల్పిస్తున్నాయి.
దీంతో ప్రముఖ వాహన తయారీ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి సారించాయి. అయితే, కాన్పూర్ ఐఐటీ మాత్రం విస్తుగొలిపే విషయాలను వెల్లడించింది. ఈ మేరకు కాన్పూర్ ఐఐటీ ఓ అధ్యయన నివేదిక విడుదల చేసింది. సంప్రదాయ హైబ్రిడ్ కార్లతో పోలిస్తే ఈవీలు ఎంతమాత్రమూ ఎకో ఫ్రెండ్లీ కాదని అధ్యయనం తేల్చి చెప్పింది.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ, వినియోగం, వాటిని తుక్కుగా మార్చే ప్రక్రియను సంప్రదాయ, హైబ్రిడ్ కార్లతో పోల్చి 15 నుంచి 50 శాతం ఎక్కువ గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయని ఐఐటీ కాన్పూర్ కు చెందిన ఇంజిన్ రిసెర్చ్ ల్యాబ్ వెల్లడించింది. కిలోమీటరు చొప్పున విశ్లేషించినప్పుడు ఈవీల కొనుగోలు, ఇన్సూరెన్స్, నిర్వహణ వంటివి 15 నుంచి 60 శాతం అధికమని తేల్చి చెప్పింది. ఈవీల కంటే సంప్రదాయ, హైబ్రిడ్ కార్లే పర్యావరణ అనుకూలమని తెలిపింది.
జపాన్ కు చెందిన ఓ సంస్థతో కలిసి ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ అవినాశ్ అగర్వాల్ ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వాహనాల్లోని బ్యాటరీలను చార్జింగ్ చేసేందుకు విద్యుత్ అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని 75 శాతం విద్యుత్ బొగ్గు నుంచి ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఈ క్రమంలో కార్బన్ డయాక్సైడ్ పెద్ద మొత్తంలో గాలిలోకి విడుదల అవుతుందని వెల్లడించారు.