First Bird Flu Death : దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం, 11ఏళ్ల బాలుడు మృతి
అసలే కరోనావైరస్ మహమ్మారి జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది చాలదన్నట్టు బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. దేశంలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా) మృతి నమోదైంది.
First Bird Flu Death : అసలే కరోనావైరస్ మహమ్మారి జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది చాలదన్నట్టు బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. దేశంలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా) మృతి నమోదైంది. హరియాణాలో 11 ఏళ్ల బాలుడు ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా వైరస్తో బాధపడుతూ మృతి చెందినట్లు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బర్డ్ ఫ్లూతో మృతి చెందిన తొలి కేసు ఇదేనన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిమ్స్ సిబ్బంది అంతా ఐసోలేషన్లో ఉన్నారు.
హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యుమోనియా, లుకేమియా లక్షణాలతో ఈ నెల 2న ఢిల్లీ ఎయిమ్స్లో చేరాడు. ఆ బాలుడికి మొదట కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్గా తేలింది. అనంతరం నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. అక్కడ బర్డ్ ఫ్లూగా తేలింది. దీంతో మరిన్ని కేసులను గుర్తించడానికి, కాంటాక్ట్ ట్రేస్ చేయడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఓ బృందాన్ని హర్యానాలోని బాలుడి స్వగ్రామానికి పంపింది.
బర్డ్ ఫ్లూను హెచ్5ఎన్1 వైరస్ లేదా ఏవియన్ ఇన్ఫ్లూయెంజాగా పిలుస్తారు. ఇది పక్షులు, కోళ్లలో వస్తుంది. బర్డ్ ఫ్లూ ఓ మనిషికి సోకడం భారత్లో ఇదే తొలిసారి. ఈ నెల 15న బర్డ్ ఫ్లూ వైరస్ జాతి అయిన హెచ్5ఎన్6 స్ట్రెయిన్ చైనాలో ఓ వ్యక్తికి సోకింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్లో బర్డ్ ఫ్లూ విరుచుకుపడింది. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఇది వెలుగుచూడడంతో వేల సంఖ్యలో పక్షులు, కోళ్లు మృతి చెందాయి. పంజాబ్లోనే 50వేల పక్షులు మృతిచెందాయి. పలు రాష్ట్రాల్లో బర్డ్ఫ్లూ వల్ల ఎక్కువగా కాకులు, బాతులు మృతిచెందాయి.
హరియాణాలో నిపుణులు ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా వైరస్ సబ్ టైప్ హెచ్5ఎన్8(H5N8)ని గుర్తించారు. ఈ జాతి మనుషులకు సోకుతుందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో బర్డ్ ఫ్లూ సంక్రమణ వ్యాప్తిని ఎదుర్కోవటానికి దేశవ్యాప్తంగా పక్షులను చంపడం జరిగింది.
జనవరిలో ఢిల్లీ ఎర్రకోట నుంచి సేకరించిన పక్షుల నమూనాలు ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా పాజిటివ్గా తేలింది. ఈ క్రమంలో ఖాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్ను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం అప్పట్లో ఆదేశించింది. ఫిబ్రవరిలో ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ నుంచి సేకరించిన మరిన్ని నమూనాల్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్గా తేలాయి.
మార్చిలో ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా తిరిగి కనిపించింది. మహారాష్ట్రలోని అమరావతి, నందూర్బార్ జిల్లాల్లో 261 పౌల్ట్రీ పక్షులు చనిపోయాయి. ఏప్రిల్లో హిమాచల్ ప్రదేశ్లోని పాంగ్ డ్యామ్ సరస్సులో 100 వలస పక్షులు చనిపోవడంతో బర్డ్ ఫ్లూ సంక్రమణ భయం మళ్లీ పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని.. కానీ ఒక్కసారి దాని బారిన పడితే మరణాల రేటు అధికంగా ఉంటుందని హెచ్చరించింది. బర్డ్ ఫ్లూ సోకిన వారిలో మరణాల రేటు 60శాతంగా ఉంటుందని తెలిపింది.