కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుని ఫోటోలతో బెదిరింపులు..
jagtial man arrested : ఇలా పరిచయం అవ్వగానే అలా నన్ను పెళ్లి చేసుకోమని అడిగిన యువకుడిని దూరం పెట్టినందుకు యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుని ఆ పై వేధింపులకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని జగిత్యా జిల్లా కేంద్రానికి చెందిన బొక్కల మనీషకు జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన కుర్మ శ్రీకాంత్కు పరిచయం ఏర్పడింది. అలా కొన్ని సార్లు వాళ్లు మాట్లాడుకున్నారు. దీంతో మనీష తనను ప్రేమిస్తోందని భ్రమపడ్డాడు శ్రీకాంత్. అదే విషయాన్ని మనీషతో చెప్పాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఎలాగైనా సరే మనీషను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడు.దానికి ఆమె అతడికి దూరంగా ఉంటోంది.
దీంతో డిసెంబర్ 10,2020 న హనుమాన్వాడలో ఉన్న మనీషను శ్రీకాంత్తోపాటు కుర్మ రమేశ్ అనే మరో యువకుడి సహాయంతో బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు. ఆ తరువాత జయ్యారంలో శ్రీకాంత్ మనీషను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత నెలరోజులకు మనీష శ్రీకాంత్ నుంచి తప్పించుకుని జగిత్యాలకు చేరుకుంది.
ఆ తరువాత శ్రీకాంత్ మనీషను బెదిరించాడు. తాను బలవంతంగా వివాహం చేసుకున్నట్లుగా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో శ్రీకాంత్ ఎటువంటివాడో నెల రోజుల నుంచి చూసిన మనీష భయపడిన ఎవరికి చెప్పలేదు. మనీష భయాన్ని శ్రీకాంత్ అలుసుగా తీసుకున్నాడు. గత రెండురోజుల నుంచి బలవంతంగా వివాహ సమయంలో దిగిన ఫొటోలు మనీష తమ్ముళ్లు, వినయ్, మణిదీప్కు వాట్సప్లో పోస్ట్ చేసి..బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితురాలు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నిందితుడు శ్రీకాంత్ ను అతనికి సహాయం చేసిన కుర్మ రమేశ్ ను అరెస్ట్ చేసి విచారణ చేస్తామని ఎస్సై శంకర్నాయక్ తెలిపారు.