Lakhimpur Kheri : కొత్త జమ్మూ కశ్మీర్ గా “ఉత్తరప్రదేశ్”.. 9 మరణాలకు ముందు అసలేం జరిగిందంటే
ఉత్తరప్రదేశ్..కొత్త జమ్ముకశ్మీర్గా మారిందని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఓమర్ అబ్దుల్లా అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు.
Lakhimpur Kheri ఉత్తరప్రదేశ్..కొత్త జమ్ముకశ్మీర్గా మారిందని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఓమర్ అబ్దుల్లా అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు. ‘ఉత్తర్ప్రదేశ్ ఈజ్ ది “నయా జేఅండ్కే”అని ట్వీట్ లో ఫరేక్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని లఖిమ్పూర్ ఖేరీ జిల్లాలోని టికునియా గ్రామంలో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటన..అనంతర పరిణామాల నేపథ్యంలో ఓమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కేంద్రంపై విమర్శలు చేస్తూ ఓ ట్వీట్ చేశారు. మానవ హక్కులు, గౌరవాన్ని తుంగలో తొక్కిన చోట 144 సెక్షన్ అమలు చేయడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం. ఈ ప్రభుత్వం తన సొంత ప్రజలపై ఉక్కు పిడికిలిని వినియోగించడంలో సంకోచించట్లేదు. అదే చైనా సైనికులు వస్తే చేతులు ముడుచుకుందని, 2019 నుంచి జమ్ముకశ్మీర్లో జరిగిన అణచివేతను ఎవరూ పోల్చలేరన్నారు. జమ్ముకశ్మీర్లో ప్రారంభమైన దురదృష్టకర వాతావరణం దేశం మొత్తాన్ని చుట్టుముట్టిందని ట్వీట్లో ముఫ్తీ తెలిపారు.
ఆదివారం నాటి ఘటన పూర్తి వివరాలు
లఖిమ్పూర్ ఖేరీ జిల్లాలోని టికునియా గ్రామంలోని ఆదివారం ఒక పాఠశాలలో బహుమతి పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా థేనిని సన్మానించాల్సి ఉంది. ఖేరి నియోజకవర్గ ఎంపీ కూడా అయిన అజయ్ మిశ్రా థేని పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ముఖ్య అతిథి. ఆదివారం లఖింపూర్ ఖేరిలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించాల్సి ఉండింది.
అయితే గత నెల 25వ తేదీన తన పుట్టినరోజున అజయ్ మిశ్రా థేని లఖిమ్పూర్ ఖేరీ సందర్శించిన సందర్భంగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్ననిరసననను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. మంత్రి పర్యటన సమయంలో ఆయనకు నల్ల జెండాలు చూపి తమ నిరసన తెలిపారు రైతులు. కాగా, నిరసన తెలిపిన రైతులు సెప్టెంబర్ 29 న ఓ సమావేశాన్ని నిర్వహించి కేంద్ర మంత్రి మరియు ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
ఆదివారం ఉదయం రైతులు టికునియా గ్రామంలోని ఓ కాలేజీకి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను నాశనం చేశారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య హెలికాప్టర్ ద్వారా వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంది కానీ రైతుల నిరసన గురించి తెలియజేయడంతో ఆయన తన ఫ్లాన్ మార్చుకొని రోడ్డు మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. డిప్యూటీ సీఎం మౌర్య రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న వార్త తెలుసుకున్న రైతులు.. టికునియా–బందిర్పూర్ రహదారిని దిగ్బంధించారు. టికునియా-బందిర్పూర్ రోడ్డుపై రైతులు నల్లజెండాలతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలో కేంద్రమంత్రి,డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. రైతులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. రెండు ఎస్యూవీ వాహనాలు వారిని ఢీకొట్టాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు- నక్షత్ర సింగ్(55),దల్జీత్ సింగ్(35),లావీప్రీత్ సింగ్(20),గుర్వేంద్ర సింగ్(18) మరణించారు. నిరసనకారులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా థేనీ కుమారుడు ఆశిష్ ఉన్నారని నిరసన వ్యక్తం చేసిన రైతులు ఆరోపించారు. రైతులపైకి కారు ఎక్కించిన కేంద్ర మంత్రి కుమారుడిని అదుపులోకి తీసుకోవాలంటూ రైతులు ఆందోళనకు దిగారు.
నలుగురు తమ సహచరులు ప్రాణాలు కోల్పోవడంతో ఆగ్రహించిన రైతులు… పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. కేంద్రమంత్రి కాన్వాయ్ వెంట కారులో ప్రయాణిస్తున్న నలుగురు బీజేపీ కార్యకర్తలను కిందకి లాగి దారుణంగా కొట్టి చంపారు రైతులు. ఇక, ఈ హింసాత్మక ఘటనలను కవర్ చేసే క్రమంలో వేగంగా వచ్చిన వాహనం ఢీకొని ఒక ఓర్నలిస్ట్ కూడా చనిపోయాడు. మొత్తంగా తొమ్మిది మంది ఆదివారం నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
మృతుల కుటుంబాలకు పరిహారం
ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.45 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తుందని ఏడీజీ(శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ సోమవారం తెలిపారు. ఆదివారం నాటి ఘటనలో గాయపడిన వారికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. హింసాత్మక ఘటనలపై రైతుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పిన ఏడీజీ ప్రశాంత్ కుమార్..ఘటనపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ చేయించనున్నట్లు తెలిపారు. ఇక,ఈ రోజు ఉదయం పోలీసులతో సమావేశం తర్వాత నలుగురి రైతుల మృతదేహాలను దహనం చేయడానికి రైతులు అంగీకరించారు. ఇక,ఆదివారం నుంచి రైతుల మరణాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు..పోలీసులతో సమావేశం తర్వాత తమ ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు.
తన కుమారుడి తప్పేమీ లేదన్న కేంద్రమంత్రి
మరోవైపు.. హింసలో మరణించిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా డిమాండ్ చేశారు. ఘటనపై సీబీఐ, సిట్ లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. బీజేపీ కార్యకర్తలపై కర్రలు, కత్తులతో దాడి చేశారని.. అక్కడే ఉన్నట్లేతే.. తను కుమారుడు కూడా మరణించేవాడినని మిశ్రా అన్నారు.
ALSO READ Supreme Court : వ్యవసాయ చట్టాలు అమల్లో లేనప్పుడు నిరసనలెందుకు?