Navjot Singh Sidhu : పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా..!
Navjot Singh Sidhu : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకు పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు.
Navjot Singh Sidhu : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకు పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. సోనియా ఆదేశాల ప్రకారమే తన రాజీనామాను సమర్పిస్తున్నట్టు సిద్ధూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలై అధికారాన్ని కూడా చేజార్చుకుంది. కాంగ్రెస్ మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే.. కేవలం 18 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. మిగతా స్థానాల్లో ఘోరం పరాజయం పాలైంది.
పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్వీప్ చేసింది. 92 స్థానాల్లో ఆప్ విజయం సాధించి అధికారాన్ని చేజిక్కిచుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పీసీసీ చీఫ్ లను వెంటనే రాజీనామా చేయాల్సిందిగా సోనియాగాంధీ ఆదేశించారు. ఇటీవలే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో తమ పదవుల నుంచి తప్పుకునేందుకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరి నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తిరస్కరించింది.
As desired by the Congress President I have sent my resignation … pic.twitter.com/Xq2Ne1SyjJ
— Navjot Singh Sidhu (@sherryontopp) March 16, 2022
కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలను చేపట్టాల్సి ఉందో సమావేశంలో చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఐదు రాష్ట్రాలైన యూపీ, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్లను తమ పదవులకు రాజీనామా చేయాల్సిందిగా సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ సిద్ధూ కూడా తన రాజీనామాను సమర్పించారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధిస్తే.. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ పాగా వేసింది.
ఆప్ ప్రభంజనానికి కాంగ్రెస్, అకాలీదళ్ చీపురు దాటికి ఊడ్చుకుపోయాయి. పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ పోటీ చేసిన రెండు చోట్ల ఘోర పరాజయం పాలయ్యారు. ఒక రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన ఆప్.. పంజాబ్లో అధికారంలోకి వచ్చి దశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించింది. ఆప్ దెబ్బకు పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా పరాజయం పాలయ్యారు.
సిద్ధూ అమృత్సర్ తూర్పు స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన జీవన్జ్యోత్ కౌర్ చేతిలో 6,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సింగ్కు మొత్తం 32,929 ఓట్లు రాగా.. ఎమ్మెల్యే కౌర్కు 39,520 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ 18, అకాలీదళ్ కూటమి 4 స్థానాలకే పరిమితమయ్యాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన నవజ్యోత్ సింగ్ ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడారు. పంజాబ్ ప్రజల తీర్పును గౌరవిస్తూ శిరసావహిస్తానని సింగ్ తెలిపారు.
Read Also : Navjot Singh Sidhu : పంజాబ్లో ఆప్ ప్రభంజనం.. ప్రజా తీర్పును శిరసావహిస్తా : నవజ్యోత్ సింగ్