UP Election : ఎర్ర టోపీలు యూపీకి రెడ్ అలర్ట్..సమాజ్వాది పార్టీపై మోదీ ఫైర్
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించారు. గోరఖ్పుర్లో నిర్మించిన ఎయిమ్స్, ఫర్టిలైజర్ ప్లాంట్,ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్
UP Election : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించారు. గోరఖ్పుర్లో నిర్మించిన ఎయిమ్స్, ఫర్టిలైజర్ ప్లాంట్,ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ యెక్క రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ను మోదీ ప్రారంభించారు. అనంతరం గోరఖ్ పూర్ లోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని.. సమాజ్ వాదీ పార్టీ పేరుని నేరుగా ప్రస్తావించకుండా “రెడ్ క్యాప్స్”అని సంభోదిస్తూ ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని ఎర్రటోపీలు ఎదురుచూస్తున్నాయని, ఉగ్రవాదుల పట్ల ఉదాసీనత చూపడానికి, వారిని జైళ్ల నుండి బయటకు తీసుకురావడానికి ఎర్ర టోపీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.. కాబట్టి ‘ఎర్ర టోపీలు’ ఉత్తరప్రదేశ్ కి రెడ్ అలర్ట్ అని,ప్రమాద ఘంటికలని గుర్తుంచుకోండి అని మోదీ అన్నారు. ఎర్రటోపీలు అధికారంలోకి వస్తే ఎర్రబుగ్గలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారని యూపీ మొత్తానికి తెలుసునని బుగ్గకార్లలో తిరిగే రాజకీయ నాయకులను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. సాధారణ ప్రజల సమస్యలు, బాధలు వారికి పట్టవని చెప్పారు.
కుంభకోణాలకు పాల్పడటానికి, ఖజానా నింపుకోవడానికి, దొరికింది దోచుకోవడానికి, మాఫియా శక్తులకు స్వేచ్ఛనివ్వడానికే సమాజ్వాది పార్టీ అధికారంపై కన్నేసిందని ఆరోపించారు. ఎస్పీ హయాంలో మాఫియాలకు స్వేచ్ఛనిస్తే, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వారిని కటకటాల వెనక్కి పంపిందని మోదీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని మరోసారి ఆశీర్వదించాలని, కేంద్రం- రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే రెట్టింపు వేగంతో అభివృద్ధి జరుగుతుందని ప్రధానమంత్రి అన్నారు. అణగారిన వర్గాల గురించి ఆలోచించే ప్రభుత్వం.. కష్టపడి పనిచేయడమే కాకుండా ఫలితాలు కూడా సాధిస్తుందన్నారు. నిజాయితీతో పనులు చేస్తే ప్రకృతి విపత్తులు కూడా ఆ పనులకు అడ్డంకి కావని అన్నారు.
గోరఖ్పుర్లో ఫెర్టిలైజర్ ప్లాంట్, ఎయిమ్స్ ప్రారంభం అనేక సందేశాలను ఇస్తోందని మోదీ అన్నారు. సంకల్పంతో ఉంటే నవ భారతంలో ఏదైనా అసాధ్యం కాదనే నిజాన్ని చాటి చెబుతోందన్నారు. కరోనా సమయంలోనూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం.. తన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించింది. గోరఖ్పుర్ ఫెర్టిలైజర్ ప్లాంట్.. రైతులకు, ఉపాధికి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసునని, కానీ గత ప్రభుత్వాలు దీన్ని ప్రారంభించేందుకు యత్నించలేదన్నారు. గోరఖ్పుర్కు ఎయిమ్స్ కోసం చాలా ఏళ్ల నుంచి డిమాండ్ ఉంది కానీ 2017కు ముందు ప్రభుత్వాలు స్థలం కేటాయించేందుకూ సాకులు వెతికాయి అని పరోక్షంగా సమాజ్ వాదీ పార్టీపై మోదీ విమర్శలు గుప్పించారు.
ALSO READ PM Modi To BJP MP’s : ఇకనైనా మారండి,లేదంటే మార్పులొస్తాయ్..బీజేపీ ఎంపీలకు మోదీ సీరియస్ వార్నింగ్