IND vs WI ODI Match: తొలి వన్డేలో సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ జెర్సీ ఎందుకు ధరించాడో తెలుసా? సంజు ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్.. ..
నిబంధనల ప్రకారం.. జెర్సీ వెనుక రాసిఉన్న పేరును ఏ ఆటగాడు తొలగించకూడదు. దీంతో సంజు శాంసన్ పేరుతోనే సూర్యకుమార్ యాదవ్ తొలి వన్డే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.
![IND vs WI ODI Match: తొలి వన్డేలో సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ జెర్సీ ఎందుకు ధరించాడో తెలుసా? సంజు ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్.. .. IND vs WI ODI Match: తొలి వన్డేలో సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ జెర్సీ ఎందుకు ధరించాడో తెలుసా? సంజు ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్.. ..](https://10tv.in/wp-content/uploads/2023/07/Surya-Kumar-Yadav.jpg)
Surya Kumar Yadav
Surya Kumar Yadav : బ్రిడ్జ్ టౌన్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్ – వెస్టండీస్ మధ్య తొలి మ్యాచ్ గురువారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. టీమిండియా ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రతిభతో వెస్టిండీస్ జట్టును మట్టికరిపించారు. దీంతో ఇండియా – వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్లో భాగంగాభారత్ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదిలాఉంటే తొలి వన్డే మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్, బ్యాటింగ్కోసం మైదానంలోకి వచ్చిన సమయంలో సంజు శాంసన్ జెర్సీని ధరించాడు. అయితే, సూర్య సంజు జెర్సీని ఎందుకు ధరించాల్సి వచ్చిందనే ప్రశ్న సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో సూర్యకుమార్ యాదవ్ ఎందుకు సంజు జెర్సీ ధరించాల్సి వచ్చిందో స్పష్టత వచ్చింది.
ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం.. మ్యాచ్ సమయానికి సూర్యకుమార్ యాదవ్ సైజు జెర్సీ అందుబాటులో లేదు. దీనికారణంగా అతను సంజు శాంసన్ జెర్సీని ధరించాల్సి వచ్చింది. మ్యాచ్ కోసం సూర్య అందుకున్న జెర్సీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉంది. దీనిపై సూర్య టీమ్ మేనేజ్మెంట్కు తెలిపాడు. అయితే, మ్యాచ్ సమయానికి సమస్య పరిష్కారం కాకపోయే సరికి సూర్య కుమార్ సంజు జెర్సీ ధరించాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం.. జెర్సీ వెనుక రాసిఉన్న పేరును ఏ ఆటగాడు తొలగించకూడదు. దీంతో సంజు శాంసన్ పేరుతో కలిగిన జెర్సీతోనే సూర్యకుమార్ యాదవ్ తొలి వన్డే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఇక రెండో వన్డే తరువాతే సూర్య తన పేరుతో జెర్సీని పొందనున్నాడు. అయితే, సంజూ ఫ్యాన్స్ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘జట్టులో చోటు కొట్టేశావు.. ఆఖరికి జెర్సీని కూడా వదల్లేదా సూర్యా బ్రో’.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. తొలివన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు వచ్చిన వెస్టిండీస్ ఆటగాళ్లు జడేజా, కుల్దీప్ యాదవ్ ల స్పిన్ దాటికి ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో కేవలం 114 పరుగులకే విండీస్ జట్టు ఆలౌట్ అయింది. తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఐదు వికెట్లు నష్టపోయి 163 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇసాన్ కిషన్ 52 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రెండో వన్డేమ్యాచ్ కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో భారత కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి 7గంటలకు ప్రారంభమవుతుంది.