T Congress: కండిషన్స్ అప్లై.. కాంగ్రెస్లో చేరడం ఈజీ కాదు
కాంగ్రెస్లో చేరాలనుకుంటున్న నేతలకు కండిషన్స్ అప్లై అంటోంది ఆ పార్టీ అధిష్టానం... టీపీసీసీకి కొత్త బాస్ వచ్చాక నేతల చూపు ఇప్పుడు కాంగ్రెస్ పై పడింది. నేతలు కాంగ్రెస్ చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
T Congress: కాంగ్రెస్లో చేరాలనుకుంటున్న నేతలకు కండిషన్స్ అప్లై అంటోంది ఆ పార్టీ అధిష్టానం… టీపీసీసీకి కొత్త బాస్ వచ్చాక నేతల చూపు ఇప్పుడు కాంగ్రెస్ పై పడింది. నేతలు కాంగ్రెస్ చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్లో చేరాలంటే ఎంట్రన్స్ టెస్ట్ తప్పనిసరి అంటోంది హస్తం పార్టీ.. ఇంతకీ ఏంటా టెస్ట్?
కాంగ్రెస్లో కొత్త గాలి వీస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్లో నూతనోత్సాహం కనిపిస్తోంది… ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న క్యాడర్ సైతం కదం తొక్కుతోంది. ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. వీటికి తోడు కొత్త బాస్ రేవంత్.. కాంగ్రెస్కు పునర్జీవం పోసేందుకు పాత నేతలందరినీ వరుసగా కలుస్తున్నారు. పార్టీలకు అతీతంగా గతంలో పలుకుబడి కలిగిన నేతలను కలవడంతో పాటు.. వారి వారసులను సైతం టచ్ చేస్తున్నారు.
రేవంత్ ఎఫెక్ట్తో తెలంగాణ పాలిటిక్స్లో సమీకరణాలు మారుతున్నాయి. కాంగ్రెస్ వైపు రాజకీయ వాతావరణం సానుకూలంగా మారడంతో.. నేతల చూపు కాంగ్రెస్ వైపు పడుతోంది. దీంతో కొందరు నేతలు కాంగ్రెస్ గొడుగు కిందకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వరకే బీజేపీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, భూపాలపల్లి నియోజకవర్గనేత గండ్ర సత్యనారాయణలు కాంగ్రెస్కు మద్దతు పలికారు.
అయితే నేతలు కాంగ్రెస్లోకి వస్తుండటంతో.. ఇది వరకే పార్టీలో ఉన్న స్థానిక నేతలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది… ముఖ్యంగా ధర్మపురి సంజయ్ కాంగ్రెస్లోకి రావడాన్ని స్థానిక నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నారని గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి… ఇలాంటి పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని భావించిన కాంగ్రెస్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది..
కాంగ్రెస్లో చేరాలనుకునే వారి విషయంలో ఒక కమిటీ వేయాలని పీసీసీ నిర్ణయించింది. ఆ కమిటీ స్క్రీనింగ్ చేసిన తర్వాతే పార్టీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో మర్రి శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయాలని భావిస్తున్నారు… ఈ కమిటీ ఒకే చెప్పి.. స్థానిక నేతలను సర్దుబాటు చేసిన తర్వాత నేతలను చేర్చుకోవాలని నిర్ణయించారు. ఒక వేళ కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కనుక నిర్ధాక్ష్యిణంగా వారిని పక్కన పెడతారని స్పష్టం చేస్తున్నారు.
ఈ నిర్ణయంతో కాంగ్రెస్లో చేరాలనుకుంటున్న వారికి ఇక ఎంట్రన్స్ టెస్ట్ తప్పనిసరి కానుంది.. ఇన్నాళ్లు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయే వారు తప్పా.. వచ్చి చేరే వారు లేరు… ఇప్పుడు వచ్చి చేరుతామంటున్న కండీషన్ల పేరుతో మోకాలడ్డు పెడుతున్నారంటూ రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.