Telangana : పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. నగరంలో ఇళ్ల పంపిణీకి షెడ్యూల్ ఖరారు, ఏకంగా 70వేల ఇళ్లు..
ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందేలా చూడాలన్నారు.(Telangana)
Telangana – Double Bed Room Houses : తెలంగాణ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదల సొంతింటి కల త్వరలో నెరవేరనుంది. హైదరాబాద్ నగర పరిధిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి షెడ్యూల్ ఖరారైంది.
ఆగస్టు మొదటి వారం నుంచి అక్టోబర్ మూడో వారం వరకు లబ్దిదారులకు ఇళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. లబ్దిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. ఆరు దశల్లో 70వేల ఇళ్ల పంపిణీ చేయాలని నిర్ణయించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆరు దశల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి జీహెచ్ఎంసీ అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు.
ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తోందని, ఇందులో అత్యధిక భాగం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తైందని కేటీఆర్ తెలిపారు. మిగిలిన చోట్ల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయన్నారు.
షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటి వారంలో ఇళ్ల పంపిణీ ప్రారంభం కానుంది. అక్టోబర్ మూడో వారం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 6 దశల్లో ఇప్పటికే పూర్తయిన సుమారు 70 వేల కుపైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందిస్తారు. వీటికి అదనంగా నిర్మాణం తుది దశలో ఉన్న ఇళ్లను కూడా ఎప్పటికప్పుడు ఈ పంపిణీ కార్యక్రమానికి అదనంగా జత చేసే అవకాశం ఉంది.
కాగా.. సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందేలా చూడాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని సూచించారు.