Intelligence Bureau : దేశంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. పసిగట్టిన నిఘా వర్గాలు
దేశంలో భారీ ఉగ్రదాడికి పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18న దీనికి సంబందించిన అలెర్ట్ జారీచేసినట్లు అధికారులు తెలిపారు
Intelligence Bureau : భారత్ లో భారీ ఉగ్రదాడికి పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18న దీనికి సంబందించిన అలెర్ట్ జారీచేసినట్లు అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లోని విశ్వసనీయ వర్గాల సమాచారం దేశంలోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఐఈడీని టిఫిన్ బాక్స్లో పెట్టి ఈ పేలుడు జరపాలని కుట్ర పన్నినట్లు తేలింది. పండగల సీజన్ ముందు దేశంలో భారీ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన నిఘా వర్గాలు, పారామిలిటరీ, రాష్ట్ర పోలీసులతో పాటు సంబంధిత ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి.
Read More : J&K : భారీ ఉగ్రదాడికి ప్లాన్, ముగ్గురు ఉగ్రవాదుల హతం
ఈ ప్లాన్ అమలు చేయడానికి ఇప్పటికే మనుషులు, అవసరమైన ఆర్థిక వనరులు, వస్తువులను సిద్ధం చేసినట్లు ఇంటెలిజెన్స్ వెల్లడించింది. గత వారం పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ నవరాత్రి, రామ్లీలా సందర్భంగా పేలుడు కోసం రచించిన ప్రణాళికను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం భగ్నం చేసింది. దీనికి సంబంధించి ఆరుగురిని అరెస్ట్ కూడా చేశారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పాటు అఫ్ఘాన్ కు చెందిన ఉగ్రవాదులు సరిహద్దులు దాటి దేశంలోకి చొరబడే అవకాశం ఉందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి నిఘా వర్గాలు.
Read More : Dussehra Celebrations : ఏపీలో అక్టోబర్ 7 నుంచి దసరా ఉత్సవాలు
లష్కర్-ఏ-తొయిబా హర్కత్ ఉల్-అన్సార్ (హువా), హిజ్బుల్ ముజాహిద్దీన్, కదలికలకు సంబంధించి పక్కా సమాచారం అందినట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడించాయి. అఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత ఐఎస్ఐ మద్దతుతో అఫ్ఘాన్ ముష్కరులు దేశంలోకి ప్రవేశిస్తున్నారన్న సమాచారం అందిందని నిఘా వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ నక్యాల్ సెక్టార్లోని ఉగ్రక్యాంపులో దాదాపు 40 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించామని నిఘా వర్గాలు రక్షణ దళాలకు తెలిపాయి.
పూంచ్ నది ద్వారా భారత్లోకి ప్రవేశించేలా శిక్షణ పొందారని పేర్కొన్న నిఘా వర్గాలు పండగల సమయంలో దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలిపారు. ఉగ్రవాదులకు టిఫిన్ బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చినట్లు, భారత్లో యాక్టివ్గా ఉన్న స్లీపర్ సెల్స్ ద్వారా టిఫిన్ బాంబుల తయారీకి కావలసిన ముడిసరుకు అందుతుందని వెల్లడించిన నిఘా వర్గాలు. నిఘా వర్గాల హెచ్చరికలతో దేశ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు.