“Skeleton Lake” : హిమాలయాల్లో ‘రూపకుండ్‌’‌ మిస్టరీ..సరస్సులో గుట్టలుగా అస్థిపంజరాలు

హిమాలయాల్లో అస్థిపంజరాల సరస్సు... ఎవరు చనిపోయారు ఎందుకు చనిపోయారు ఎలా చనిపోయారనేది వందల ఏళ్లుగా ఇప్పటికి అంతుచిక్కని రహస్యం. పరిశోధకులకు కూడా దొరకని మర్మం ఆ సరస్సులో దాక్కొని ఉంది. వందలాది మంది మూకుమ్మడిగా ఎలా చనిపోయారు. అస్థికల సరస్సు వెనుక అసలు ఏం జరిగింది?

“Skeleton Lake” : హిమాలయాల్లో ‘రూపకుండ్‌’‌ మిస్టరీ..సరస్సులో గుట్టలుగా అస్థిపంజరాలు

Skeleton Lake Roopkund In Himalayas (2)

“Skeleton Lake” Roopkund In Himalayas: హిమాలయాల్లో అస్థిపంజరాల సరస్సు… ఎవరు చనిపోయారు ఎందుకు చనిపోయారు ఎలా చనిపోయారనేది వందల ఏళ్లుగా ఇప్పటికి అంతుచిక్కని రహస్యం. పరిశోధకులకు కూడా దొరకని మర్మం ఆ సరస్సులో దాక్కొని ఉంది. వందలాది మంది మూకుమ్మడిగా ఎలా చనిపోయారు. అస్థికల సరస్సు వెనుక అసలు ఏం జరిగింది?

హిమాలయ పర్వత సానువుల్లోని ఒక మారుమూల మంచు లోయలో ఏర్పడిన సరస్సు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విస్తరించి ఉన్న హిమాలయాల్లో ‘త్రిశూల్’ పర్వతం దేశంలోని ఎత్తైన పర్వతాల్లో ఒకటి. ఏటవాలగా ఉండే ఈ పర్వతానికి దిగువనే ఉంది ఎన్నో రహస్యాలకు కేంద్రబిందువైన రూపకుండ్ సరస్సు. ఏడాదిలో 11 నెలలు ఈ సరస్సు మంచుతో కప్పి ఉంటుంది. మే నెలలో మాత్రమే ఆ సరస్సులో నీరు కనిపిస్తుంది. రూపకుండ్‌కు ఆ పేరు రావడానికి కూడా ఓ కథ ప్రచారంలో ఉంది. పార్వతీ దేవితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చిన శివుడు ఈ సరస్సును సృష్టించాడని చెబుతారు. రాక్షసులను సంహరించిన తర్వాత పార్వతీదేవి వస్త్రాలు మలినం కావడంతో ఆమె ఆ సరస్సులో స్నానం చేసిందంటారు. అందుకే ఆ సరస్సుకు ఆమె పేరు మీదే రూపకుండ్‌ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ అందమైన సరస్సు లోపలో మరో భయంకరమైన నిజం దాగుంది అదే అస్థిపంజరాల కథ.

ఈ సరస్సులో వేసవి కాలంలో వందల సంఖ్యలో అస్థిపంజరాలు సైతం ప్రత్యక్షమవుతాయి. మేనెలలో ఎండలకు సరస్సులో నీరు తగ్గే కొద్ది సరస్సు అంచులో అస్థిపంజరాలు కనిపిస్తాయి. ఇలా చాలా ఏళ్లుగా జరుగుతోంది. కానీ ఇప్పటికి ఆ అస్థిపంజరాలు అక్కడ ఎందుకున్నాయో ఎవరు చనిపోయారో ఎవరికి తెలియదు. వందలాది మంది ఒకేసారి ఎలా చనిపోయారనేది ఇప్పటికి అక్కడ అంతుపట్టని విషయం అందుకే ఈ సరస్సును అస్థిపంజరాల సరస్సు అని కూడా పిలుస్తారు. రూపకుండ్ సరస్సు చుట్టూ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం మాత్రం పర్యాటకులను ఆకర్షించేలా ఉంటుంది. కానీ రూపకుండ్ సరస్సులో బయటపడ్డ అస్థిపంజరాలు మాత్రం భయం కలిగిస్తాయి. చమోలి జిల్లాలో సముద్ర మట్టానికి 5,029 మీటర్ల ఎత్తులో ఈ సరస్సు ఉంది. త్రిశూల్‌ పర్వతం దిగువున, సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఉన్న రూపకుండ్ సరస్సు పర్యాటకులను ఆకర్షిస్తోంది.

1942లో బ్రిటీష్ ప్రభుత్వానికి చెందిన ఓ అటవీ అధికారి తొలిసారిగా అస్థిపంజరాలను చూశాడు. రూపకుండ్ సరస్సుకి మరో పేరు స్కెలిటన్ లేక్. ఆ పేరు రావటానికి కారణం అందులో దొరికిన అస్థి పంజరాలు అని చెప్పుకోవాలి. ఈ సరస్సును నందా దేవి అటవీ రేంజర్ హెచ్ .కె మద్వాల్ అనే వ్యక్తి మొదటిసారి 1942లో వెలుగులోకి తెచ్చాడు. అప్పటినుంచీ ఈ సరస్సుపై దేశవిదేశీ సంస్థలు చాలా పరిశోధనలు చేశాయి.అప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని వందల అస్థిపంజరాలు పర్యాటకుల కంటపడ్డాయి. అయితే, ఆ అస్తిపంజరాలు ఎవరివీ? అక్కడ వందల సంఖ్యలో ప్రజలు ఎందుకు చనిపోయారు? అసలేం జరిగింది? అనే విషయంపై పరిశోధనలు జరిగాయి కానీ ఎవరూ దీనికి కచ్చితమైన సమాధానం కనిపెట్టలేకపోయారు. ఈ అస్థి పంజరాల అవశేషాలపై జరిపిన కొన్ని అధ్యయనాల్లో వెలుగు చూసిన కొన్ని అంశాలు.. వీరిలో చాలా మంది పొడుగు మనుషులు, “సగటు ఎత్తు కన్నా ఎక్కువ ఉండేవారని” తేలింది.

వీరిలో ఎక్కువ భాగం మధ్య వయస్కులు.. 35 నుంచీ 40 ఏళ్ల మధ్యలో ఉన్నారు. పసివాళ్లుగానీ, చిన్నపిల్లలుగానీ లేరు. కొందరు వృద్ధ మహిళలు ఉన్నారు. అందరూ దాదాపు మంచి ఆరోగ్యవంతులే. వీరంతా ఒకే సమూహానికి చెందిన మనుషులని, 9వ శతాబ్దంలో సంభవించిన ఒక విపత్తు కారణంగానే వీరందరూ మరణించారని ఓ అంచనా. అందుకే రూపకుండ్ సరస్సుపై ఇప్పటికి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడి రహస్యాన్ని తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ అంతర్జాతీయ పరిశోధన సంస్థలతో కలిసి పదేళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉంది. ఈ పరిశోధనల్లోనే ఈ అస్థికలకు వేల ఏళ్ల చరిత్ర ఉందన్న సంగతి బయటపడింది.

అక్కడికి ఆ ప్రజలు ఎందుకు వచ్చారు?ఎక్కడినుంచి వచ్చారు అనే దానిపై ఇంకా సరైన ఆధారాలు దొరకలేదు. ఆ అస్థి పంజరాలలో కొన్ని పొట్టిగాను, మరికొన్ని పొడవుగాను ఉన్నట్టు గుర్తించారు. సరస్సులో అస్థిపంజరాలను గుర్తించాక వాటిపై పరిశోధనలు జరిగాయి. అయితే అప్పటికి కొన్ని అస్థిపంజరాలకు మాంసపు ముద్దలు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆ ప్రదేశం కాలుష్యరహితం కావడం విపరీతమైన మంచులో కప్పబడి ఉండటం వల్ల అక్కడ ఉన్న కొన్ని మృతదేహాలు పాడవకుండా అలాగే వున్నాయనేది శాస్త్రవేత్తల వాదన. ఆ మృతదేహాలపై డి.ఎన్.ఏ పరీక్షలు చేసిన శాస్త్రవేత్తలు అక్కడ చనిపోయిన వారు ఒక సమూహానికో లేదా ఒక ప్రాంతానికో చెందినవారు కాదు. వారందరూ వివిధ ప్రాంతాలకు చెందినవారుగా చెప్పారు. అంతే కాదు అక్కడ చనిపోయిన వాళ్లంతా ఒకేసారి చనిపోలేదని వారు మరణించిన సమయాల మధ్య వందల సంవత్సరాల తేడా ఉందని గుర్తించారు.

2004వ సంవత్సరంలో కొందరు పరిశోధకులు ఈ అస్థిపంజరాలు 850 సంవత్సరాల క్రితం నాటివని తేల్చారు. అయితే ఒకేసారి వందలాదిమంది మృత్యువాత పడటానికి దారితీసిన పరిస్థితులేమిటన్నది ఇప్పటికీ ఎలాంటి ఆధారం దొరకలేదు. అక్కడి నదులను కలుషితం చేస్తూ హిమాలయాల పవిత్రతను నాశనం చేస్తూన్నారంటూ ఆగ్రహించిన ఒక దేవత అక్కడి ప్రజలపై ఇనుప గుండ్ల లాంటి తుఫాను సృష్టించి అందరినీ బలి తీసుకున్నదని స్థానికులు విశ్వసిస్తున్నారు. వేసవిలో సరస్సులోని మంచు కరిగి నీరైన సందర్భాలలో మంచు కప్పిన ఈ అస్థిపంజరాలు బయటపడుతున్నాయి. ఇప్పటికి ఈ ప్రదేశంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అస్థిపంజరాల విషయం ప్రపంచానికి తెలియడంతో ఇప్పుడు ఆ ప్రదేశానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. ఆ వింత గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.