Revanth Reddy: ఇంకెంత కాలం భరిద్దాం? విద్యార్థులు తలుచుకుంటే కేసీఆర్ ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు: రేవంత్ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాసింపేటలో విద్యార్థులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థుల ఉద్యమమని చెప్పారు. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా సమాజం కోసం పోరాడారని తెలిపారు.

Revanth Reddy: ఇంకెంత కాలం భరిద్దాం? విద్యార్థులు తలుచుకుంటే కేసీఆర్ ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు: రేవంత్ రెడ్డి

Revanth

Revanth Reddy: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాసింపేటలో విద్యార్థులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కోసం కాంగ్రెస్ ఎంఎస్పీ విధానం తీసుకోస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టానికి తూట్లు పొడిచిందని తెలిపారు. అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ ను అమలు చేసి రైతులను ఆదుకుంటామని చెప్పారు. ఇంటికో ఉద్యోగం అంటే కేసీఆర్ దృష్టిలో వాళ్ల ఇంట్లో ఉన్న వాళ్లందరికీ ఉద్యోగాలు ఇచ్చుకోవడమేనని అన్నారు. రాచరికపు పోకడలను ఇంకెంత కాలం భరిద్దాం? అని నిలదీశారు. విద్యార్థులు పోరాట పటిమను అలవర్చుకోవాలని చెప్పారు. విద్యార్థులు అనుకుంటే కేసీఆర్ ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని అన్నారు. పేదలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థుల ఉద్యమమని రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా సమాజం కోసం పోరాడారని తెలిపారు. మలి దశ తెలంగాణ ఉద్యమం విద్యార్థుల వల్లే ఉవ్వెత్తున ఎగిసిందని రేవంత్ రెడ్డి చెప్పారు. కేవలం రాజకీయ నాయకుల వల్లే తెలంగాణ ఏర్పడలేదని, విద్యార్థుల త్యాగాల పునాదులపై ఏర్పడిందని తెలిపారు. ఆడపిల్లల హాస్టళ్లలో మౌలిక వసతులు లేవని ఆడపడుచులు గోడు వినిపించారని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోవడం వల్ల సర్టిఫికెట్లు తీసుకునేటపుడు ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని మరో ఆడబిడ్డ చెప్పిందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆడబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పాలనను కేసీఆర్ గాలికొదిలేశారని అర్థమైందని అన్నారు. కేసీఆర్ తెలంగాణ మోడల్ అంటే.. మినిమం గవర్నెన్స్ మాక్సిమం పాలిటిక్స్ అని ఎద్దేవా చేశారు. దేశం ఆకలి తీర్చేందుకు హరిత విప్లవం తీసుకొచ్చింది కాంగ్రెస్ అని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందని తెలిపారు.

బీడీఎల్, బీహెచ్ఈఎల్, రైల్వే, ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అని అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో మినహాయింపు పొందిన పరిశ్రమల్లో కూడా రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కాంగ్రెస్ ఆలోచిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సంస్థలను మోదీ ప్రయివేటుకు అప్పగించారని అన్నారు. లాభాలు వచ్చే సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు తక్కువ ధరకే అమ్మేస్తున్నారని చెప్పారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితని అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేస్తే.. రిజర్వేషన్ల అమలు జరగదని చెప్పారు.

కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో 30వేల స్కూల్స్ తెరిస్తే.. కేసీఆర్ ప్రభుత్వంలో 6,354 సింగిల్ టీచర్ పాఠశాలలు మూసేశారని రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో మారుమూల ప్రాంతాల విద్యార్థులకు చదువు దూరమైందని చెప్పారు. కేసీఆర్ పేదలకు విద్యను దూరం చేసే కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చెప్పారు. ప్రయివేటు యూనివర్సిటీలు తెరిచి విద్యను వ్యాపారం చేస్తున్నారని అన్నారు. ప్రయివేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఉండవని చెప్పారు. బిశ్వాల్ కమిటీ 1,91,354 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పిందని, కానీ రిటైర్మెంట్ వయసు పెంచి ఉద్యోగ ఖాళీలను కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేదని అన్నారు.

అధికారంలోకి వచ్చాక అన్ని విద్యా సంస్థల్లో 25శాతం రిజర్వేషన్ ఇచ్చేలా కాంగ్రెస్ విధానం తీసుకొస్తుందని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేసి తీరతామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని అన్నారు. శాఖలవారీగా ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల కేసులను ఒక్క కలం పోటుతో తొలగిస్తామని అన్నారు. 10శాతం పైగా నిధులు విద్య కోసం ఖర్చు చేస్తామని చెప్పారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి హాస్టళ్లను ఆదర్శంగా తీర్చి దిద్దుతామని అన్నారు.

YSR Rythu Bharosa-PM Kisan Funds : వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులు జమ