TRS 21st Plenary : టీఆర్ఎస్ 21వ ప్లీనరీలో ఆమోదం తెలుపనున్న తీర్మానాలు…

తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని నేడు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా నిర్వహించటానికి సర్వం సిద్ధమైంది. ఈ ప్లీనరీలో టీఆర్ఎస్ పలు కీలక తీర్మానాలను ప్రవేశ పెట్టి ఆమోదించనుంది.

TRS 21st Plenary : టీఆర్ఎస్ 21వ ప్లీనరీలో ఆమోదం తెలుపనున్న తీర్మానాలు…

Trs 21st Plenary

TRS Plenary Resolutions: తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని నేడు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా నిర్వహించటానికి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ నగరం అంతా గులాబీ మయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా జెండాలు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. . మరికాసేపట్లోనే టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు టీఆర్ఎస్ ప్లీనరీ కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది ప్రతినిధులు టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. అయితే జాతీయ రాజకీయాలే కేంద్ర బిందువుగా టీఆర్ఎస్ ప్లీనరీ జరగనున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేయడంతో పాటుగా.. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పాత్రపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఈ 21వ టీఆర్ఎస్ ప్లీనరీలో మొత్తం 13 తీర్మానాలను ప్రవేశపెట్టి.. వాటికి ఆమోదం తెలుపనున్నారు. వీటిని పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ప్రవేశపెట్టనున్నారు.

1. యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం. ఈ తీర్మానాన్ని వ్యసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు.
2.దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక భూమిక పోషించాలి ఈ తీర్మానాన్ని ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రవేశపెట్టనున్నారు.
3.ఆకాశాన్ని అంటేలా ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.
4.చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసి అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం
5.భారతేదశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం.
బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ జనగణన జరపాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం- ఎమ్మెల్సీ మధుసూదనా చారి
6. బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, బీసీ జనగణన జరపాలని తీర్మానం.
7.తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్‌ శాతం పెంచాలని, ఎస్సీ వర్గీకరణ తక్షణమే చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ తీర్మానం.
8.రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని, డివిజబుల్‌ పూల్‌లోనే పన్నులు వసులు చేయాలని తీర్మానం.
9.కృష్ణా నదీ జలాల వివాద చట్టం సెక్షన్‌-3 ప్రకారం కృష్ణాజలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిర్ణయించాలని, ఈ మేరకు బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు కేంద్రం రిఫర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం- ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
10. భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపినిస్తూ తీర్మానం.
11. తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను, వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం.
12.దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలుచేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.
13.చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, చేనేత రంగాన్ని దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తీర్మానం- ఎమ్మెల్సీ ఎల్ రమణ

కాగా..టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. సంబురాల వాతావరణం కనిపిస్తోంది. ప్రతీ నాయకుడిలోనూ ఉత్సాహం కనిపిస్తోంది. పలు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో టీఆర్ఎస్ శ్రేణులు పార్టీ జెండాను ఎగరవేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణభవన్‌లో 40 అడుగుల పార్టీ జెండాను ఏర్పాటుచేశారు. ఆ జెండాను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం ఆవిష్కరించారు.