సుశాంత్ కేసులో కీలకంగా హైదరాబాద్ సిద్ధార్థ్ స్టేట్మెంట్
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు.. రోజురోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే ఈ కేసు నిమిత్తం సీబీఐ అనేకమందిని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్కు చెందిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ స్నేహితుడైన సిద్దార్థ్ పితాని స్టేట్మెంట్ని సీబీఐ రికార్డ్ చేసింది.
ఈ విచారణలో సిద్దార్థ్ పితాని నుంచి సీబీఐ కీలక విషయాన్ని రాబట్టినట్లుగా తెలుస్తుంది. సుశాంత్ నివాసంలోని కొన్ని ఆధారాలను సేకరించిన సీబీఐ, ఈడీ అధికారులు.. ముంబైలో ఇంకా విచారణను కొనసాగిస్తున్నారు. జూన్ 14వ తేదీ (సుశాంత్ చనిపోయిన రోజు) రాత్రి సుశాంత్ తనతో నార్మల్గానే మాట్లాడారని సీబీఐకి సిద్దార్థ్ తెలుపగా, రియా ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయిందనే అంశంపై సిద్దార్థ్ను సీబీఐ ప్రశ్నిస్తోందని తెలుస్తుంది.
టోటల్గా ఈ కేసు చివరికి ఎలా బయటికి వస్తుందో తెలియదు కానీ.. ఒక మిస్టరీగా మాత్రం నడుస్తోంది. సుశాంత్ కేసులో పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకముందని విచారణకు ఎప్పుడు పిలిచినా సహకరిస్తానని సిద్ధార్థ్ తెలిపాడు.