సరిలేరు నీకెవ్వరు.. అల.. అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్

  • Published By: vamsi ,Published On : January 10, 2020 / 04:11 AM IST
సరిలేరు నీకెవ్వరు.. అల.. అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్

పెద్ద సినిమాలు వస్తున్నాయంటే అభిమానులు ఉదయం నుంచే హడావుడి చేయడం మొదలు పెడతారు. మార్నింగ్ షోల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తారు. అందులోనూ సంక్రాంతి అంటే ఇంక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సంక్రాంతికి కూడా పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం అయ్యాయి. సుపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు, అల్లూ అర్జున్.. అల వైకుంఠపురములో’ సినిమాలు సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు సిద్ధం అయ్యాయి. ఈ క్రమంలోనే ఇద్దరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాయి తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు. 

ఈ రెండు సినిమాలకు అదనపు షోలకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి రెండు తెలుగు ప్రభుత్వాలు. మహేష్ బాబు సినిమాకు 11వ తేదీ నుంచి 24 వరకు, అల్లు అర్జున్ సినిమాకి 12 నుండి 24 వరకు ఉదయం 7 గంటలకు స్పెషల్ షో వేసుకునేందుకు అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే, రెండు సినిమాలకు జనవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేక షోలు వేసుకోవడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాలు ఐదు షోలు ప్రదర్శితం కానున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ రేపు(11 జనవరి 2020) విడుదల అవుతుండగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతి కానుకగా వరుస రోజుల్లో విడుదలవుతున్నాయి. రెండు సినిమాలపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.