ఈ ప్రత్యేకమైన రోజుని ఎప్పటికీ మరిచిపోలేను..
‘కెజియఫ్ – చాప్టర్1’ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ హీరో యష్ తొలి చిత్రం ‘మొగ్గిన మనసు’ విడుదలై ఈ జూలై 18కి పన్నెండేళ్ళు పూర్తయింది. ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే – యష్ శ్రీమతి రాధికా పండిట్ కూడా ఈ సినిమాతోనే పరిచయమయ్యారు. 2008లో విడుదలైన ‘మొగ్గిన మనసు’ సినిమా రొమాంటిక్ డ్రామా. యష్, రాధికా పండిట్ కలిసి నటించిన ఈ సినిమాకి శశాంక్ దర్శకుడు. ఈ సినిమా కమర్షియల్గా హిట్ కావడంతో పాటు మంచి పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత యష్ మొదల సాల, రాజధాని, కిరాతక, డ్రామా, గజకేసరి, గూగ్లీ, రాజాహులి సినిమాలతో పాపులర్ అయ్యారు. మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో కూడా రాధికా పండిట్ హీరోయిన్ కావడం విశేషం. ఆ తర్వాత ‘కెజియఫ్ చాప్టర్1’ సినిమాతో ఆలిండియా స్టార్ అయ్యారు. ‘కెజియఫ్ చాప్టర్2’ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘మొగ్గిన మనసు’ సినిమాలో యష్ శ్రీమతి రాధికా పండిట్ హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.
తన సినీ కెరీర్కి పన్నెండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా యష్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రత్యేకమైన రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. ఒక స్క్రాప్ నుంచి తారాస్థాయికి వచ్చాను. ప్రస్తుతం నేను చేస్తున్న ‘కెజియఫ్ చాప్టర్2’ షూటింగ్ కొంత బ్యాలెన్స్ వర్క్ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము..’’ అని తెలిపారు.