ఢిల్లీలో కోళ్లు, ప‌క్షుల దిగుమ‌తిపై నిషేధం

ఢిల్లీలో కోళ్లు, ప‌క్షుల దిగుమ‌తిపై నిషేధం

Ban on import of poultry in Delhi : దేశంలో బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో కోళ్లు, ఇత‌ర ప‌క్షుల దిగుమ‌తిపై నిషేధం విధించింది. ఇటీవ‌ల అక్క‌డ వ‌రుస‌గా ప‌క్షులు మృత్యువాత ప‌డుతుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ వెల్ల‌డించారు. అలాగే ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను మ‌రో 10 రోజుల‌పాటు మూసే ఉంచ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. చ‌నిపోయిన కోళ్ల నుంచి కొన్ని శాంపిల్స్ తీసి జ‌లంధర్‌లోని ల్యాబ్‌కు పంపించామ‌ని, సోమ‌వారం రిపోర్టులు వ‌స్తాయ‌ని కేజ్రివాల్ చెప్పారు. ఆ రిపోర్టుల ఆధారంగా ఢిల్లీలో అవసరమైన చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు.

ఇప్పటికే కేర‌ళ స‌హా ఇత‌ర ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి చికెన్ దిగుమ‌తుల‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. ‌బర్డ్ ఫ్లూ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ప‌దిరోజుల‌పాటు ఈ నిషేధం కొన‌సాగుతుంద‌ని తెలిపింది. ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని స‌రిహ‌ద్దు జిల్లాల‌కు చికెన్ స‌ర‌ఫ‌రా జ‌రుగ‌కుండా ఆదేశాలు జారీ చేసిన‌ట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

ద‌క్షిణాధిలో కేర‌ళ స‌హా మ‌రికొన్ని రాష్ట్రాల్లోని కోళ్ల‌లో బ‌ర్డ్ ఫ్లూ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని, అందుకే ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా ఆయా రాష్ట్రాల నుంచి 10 రోజుల‌పాటు మాంసం దిగుమ‌తుల‌పై నిషేధం విధించాల్సి వ‌చ్చింద‌ని సీఎం తెలిపారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాకుల‌తోపాటే గాల్లో ఎగిరే ఇత‌ర‌ ప‌క్షుల్లోనూ బ‌ర్డ్ ఫ్లూ ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని, అయితే కోళ్ల‌లో మాత్రం రాష్ట్రంలో ఎక్క‌డా బ‌ర్డ్ ఫ్లూ ఆన‌వాళ్లు క‌నిపించ‌లేద‌ని తెలిపారు.

బర్ల్ ఫ్లూ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఎక్కడైనా పక్షులు చనిపోతే ఆ వివరాలను వెంటనే కేంద్రానికి అందజేయాలని సూచించింది. అంతేకాదు ఈ సీజన్‌లో మన దేశానికి విదేశాల నుంచి పెద్ద మొత్తంలో వలస పక్షులు వస్తాయని.. ఈ నేపథ్యంలో వాటిపై గట్టి నిఘా ఉంచాలని తెలిపింది. ఈ వైరస్ మనుషులకు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.