ఢిల్లీలో కరోనా కేర్ సెంటర్లుగా బంకెట్ హాల్స్… కోవిడ్ రోగుల‌తో కిక్కిరిసిన హాస్పిటల్స్

  • Published By: bheemraj ,Published On : June 25, 2020 / 10:05 PM IST
ఢిల్లీలో కరోనా కేర్ సెంటర్లుగా బంకెట్ హాల్స్… కోవిడ్ రోగుల‌తో కిక్కిరిసిన హాస్పిటల్స్

ఢిల్లీలో ఆసుప‌త్రులు క‌రోనా రోగుల‌తో కిక్కిరిసిపోయాయి. దీంతో కొత్త రోగుల‌కు ఆసుప‌త్రులో బెడ్లు దొర‌క‌డం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఢిల్లీలోని ద‌ర్య‌గంజ్‌లో షెహ‌నాయ్ బంకెట్ హాల్ కరోనా కేర్ సెంట‌ర్‌గా మారింది. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద క‌రోనా ఆసుప‌త్రి అయిన‌ లోక్ నాయ‌క్ జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ్ హాస్పిట‌ల్‌(ఎల్ఎన్‌జెపి)కు అనుసంధాన‌ంగా ఉంటుంది. 100 ప‌డ‌క‌ల‌ సామ‌ర్థ్యం క‌లిగిన‌ ఈ బంకెట్ హాల్‌లో 50 మంది హెల్త్ కేర్ సిబ్బంది ప‌ని చేస్తారు. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌, ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియాతో క‌లిసి బుధ‌వారం ఈ కరోనా కేర్ సెంట‌ర్‌ను ప్రారంభించారు.

దీని గురించి ‘డాక్ట‌ర్స్ ఫ‌ర్ యు’ ఎన్జీవో వ్య‌వ‌స్థాప‌కుడు డా.ర‌వికాంత్ సింగ్ మాట్లాడుతూ.. “ఇక్క‌డ అన్ని సేవ‌లు ఉచితమే. పేషెంట్ల ఖ‌ర్చు మేమే భ‌రిస్తాం. ఇక్క‌డ‌ 12 మంది డాక్ట‌ర్లు, 24 మంది న‌ర్సులు, 20 మంది వార్డ్ బాయ్‌లు ఉంటారు. అత్య‌వ‌స‌ర వేళల్లో ఉప‌యోగించేందుకు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు కూడా అందుబాటులో ఉన్నాయి” అని పేర్కొన్నారు. కాగా మ‌రో 80 బంకెట్ హాళ్ల‌ను సైతం కరోనా కేర్ సెంట‌ర్లుగా మార్చేందుకు ఆప్ ప్ర‌భుత్వం యోచిస్తోంది. త‌ద్వారా అద‌నంగా 11వేల బెడ్లు అందుబాటులోకి వ‌స్తాయి.

ఢిల్లీలో కొత్తగా 3,390 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 64 మంది మృతి చెందారు. కరోనా కేసుల సంఖ్య 73, 780కి చేరింది. మొత్తం 2,429 మంది మృతి చెందారు. దేశంలో కరోనా కలకలం కొనసాగుతోంది. గతవారం రోజులుగా 14 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా, గురువారం రికార్డు స్థాయిలో 17వేలకు చేరువలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా కేసులు నమోదయ్యాయి.