దారితప్పిన వ్యక్తిని పాకిస్తాన్కు అప్పగించిన భారత జవాన్లు
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తితలు నెలకొన్న సమయంలో భారత జవాన్లు మాత్రం మానవత్వాన్ని చాటుకున్నారు. పాకిస్తాన్ భూభాగం దాటి పొరపాటున భారత్ సరిహద్దులలోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని, సురక్షితంగా పాకిస్తాన్ సైనికులకు బీఎస్ఎఫ్ జవాన్లు అప్పగించారు.
పాకిస్తాన్కు చెందిన 60 ఏళ్ల వ్యక్తి శుక్రవారం జమ్ముకశ్మీర్లోని సాంబా జిల్లాలో సరిహద్దులు దాటాడు. అతడిని గుర్తించిన భద్రతాబలగాలు, వెంటనే అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం అతడిని విచారించగా, పొరపాటున సరిహద్దు దాటానని చెప్పుకొచ్చాడు. దీంతో పాకిస్తాన్ సైనికులకు బీఎస్ఎఫ్ జవాన్లు అతనిని అప్పజెప్పారు. ఇలా అప్పజెప్పడం వల్ల ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనే అవకాశాలు మెరుగుపడుతాయని భారత జవాన్లు భావిస్తున్నారు.