భారత్ తో కలసి పని చేయడానికి సిద్ధం…చైనా
భారత్ తో కలసి పని చేయడానికి తాము సిద్ధమని చైనా తెలిపింది. ఇరు దేశాల ముందున్న సరైన దారి పరస్పరం గౌవరించుకోవడమేనని చైనా విదేశాంగశాఖ పేర్కొంది.
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా భారత ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ స్పందిస్తూ…. మోడీ స్పీచ్ను విన్నాం. మనం దగ్గరి పొరుగు వాళ్లం. ఒక బిలియన్ జనాభాతో ఎదుగుతున్న దేశాలం మనం. ఈ నేపథ్యంలో దైపాక్షిక సంబంధాల అభివృద్ధిలో భాగంగా ఇరు దేశాల ప్రజల ఆసక్తులను దృష్టిలో పెట్టుకొని స్థిరత్వం, శాంతితోపాటు ఈ రీజియన్, ప్రపంచ శ్రేయస్సు ముఖ్యం.
కాబట్టి రెండు దేశాలు పరస్పర గౌరవం, మద్దతుతో ముందుకెళ్లాలి. ఇది దీర్ఘ కాల ఆసక్తులకు ఊతం ఇస్తుంది. అందుకే ఇండియాతో పని చేయడానికి చైనా సిద్ధంగా ఉంది. ఇరు దేశాల రాజకీయ నమ్మకాలు, దైపాక్షిక బంధాల వృద్ధి, యథార్థంగా సహకరించుకోవడానికి మా మధ్య ఉన్న వైరుధ్యాలను అధిగమించాల్సి ఉంటుందని అన్నారు.
కాగా, ఆగస్టు-15న ఢిల్ల్లీలోని ఎర్రకోటపై పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ సైనిక దళాలను బలోపేతం చేయడంతోపాటు ప్రాదేశిక సమగ్రత ముఖ్యమని చెప్పారు. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) నుంచి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వరకు దేశ సార్వభౌమత్వంపై ఎవరైనా కన్నేస్తే వాళ్లకు అర్థమయ్యే భాషలో భద్రతా దళాలు బుద్ధి చెబుతాయి. భారత ప్రాదేశిక సమగ్రతే మాకు కీలకం. మేం ఏం చేయగలమో, మా సైనికులు ఏం చేయగలరనే దాన్ని అందరూ లడఖ్లో చూశారని మోడీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.