Mumbai Ex-Top Cop : రష్యాకి పారిపోయిన పరమ్ బీర్ సింగ్!
ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాల వాహనం కేసుని హ్యాండిల్ చేస్తున్న ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్బీర్ సింగ్ అదృశ్యమయ్యాడు
Ex-Top Cop ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాల వాహనం కేసుని హ్యాండిల్ చేసిన ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్బీర్ సింగ్ అదృశ్యమయ్యాడు. అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న కారు నిలిపి ఉంచిన కేసులో అరెస్టయిన ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ యూనిట్ మాజీ హెడ్గా సచిన్ వాజేతో..పరమ్ బీర్ సింగ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా వరుస వేధింపు కేసులను కూడా పరమ్ బీర్ సింగ్ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కనిపించకుండా పోయారని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ తెలిపారు.
ALSO READ ఏపీపీఎస్సీ మరో 2 నోటిఫికేషన్లు
పరమ్ బీర్ సింగ్ రష్యాకి పారిపోయినట్లు వస్తున్న వార్తలపై స్పందించిన హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్..ఓ ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వ క్లియరెన్స్ లేకుండా పరమ్ బీర్ సింగ్ విదేశాలకు వెళ్లేలేడు. కేంద్ర హోంశాఖతో కలిసి మేము పరమ్ బీర్ సింగ్ ఎక్కడున్నాడో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. లుక్ ఔట్ నోటీసు జారీ చేశాం. ఒకవేళ ఆయన దేశం దాటి వెళ్లి ఉంటే..అది మంచిది కాదు. ఒక మంత్రి, అధికారి లేదా ముఖ్యమంత్రి అయినా పరిమితులు ఉన్నాయి మరియు భారత ప్రభుత్వం అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లలేరు. ఈ పరిమితులను ఎవరూ దాటలేరు. పరమ్ బీర్ సింగ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో కేంద్రంతో చర్చించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం అతని కోసం వెతుకుతోంది అని హోం మంత్రి తెలిపారు
ఈ ఏడాది ఫిబ్రవరి 25 న, ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసానికి సమీపంలోని పేలుడు పదార్థాలైన జిలటిన్ స్టిక్లతో నిండి ఉన్న ఒక SUV కార్ కనుగొనబడింది. ఈ కారు మన్సుఖ్ హిరెన్ అనే వ్యక్తికి చెందినది. ఈ కారు ఘటనపై కేసు నమోదైన కొద్దిరోజులకే మన్సుఖ్ హిరెన్ మృతదేహం థానేలోని ఓ కాలువలో కనుగొనబడింది.
పేలుడు పదార్థాల కారు కేసులో మరియు ఆ తర్వాత మన్సుఖ్ హిరెన్ హత్య కేసులో ప్రధాన కుట్రదారుగా అప్పటి ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సచిన్ వాజే పేరు తెరపైకి వచ్చింది. సచిన్ వాజే.. పరమ్ బీర్ సింగ్కు సన్నిహితుడు.
మార్చిలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)వాజేని అరెస్ట్ చేసిన తర్వాత ముంబై పోలీస్ కమిషనర్ పదవి నుండి పరమ్ బీర్ సింగ్ బదిలీ చేయబడ్డారు. ఈ కేసులో ఎన్ఐఏ ఛార్జిషీట్ పరమ్ బీర్ సింగ్ ను నిందితుడిగా పేర్కొనలేదు కానీ చార్జిషీట్ లోని అనేక విషయాలు పరమ్ బీర్ సింగ్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. హోంగార్డు విభాగానికి బదిలీ అయిన తరువాత పరమ్ బీర్ సింగ్..అప్పటి హోంమంత్రి అనీల్ దేశ్ ముఖ్ పై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. హోటల్ మరియు బార్ యజమానుల నుండి లంచాలు వసూలు చేయమని పోలీసు అధికారులను అనిల్ దేశ్ ముఖ్ ఆదేశించేవాడని పరమ్ బీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో అనీల్ దేశ్ముఖ్ పై సీబీఐ కేసు నమోదు చేయడంతో ఆయప తన హోంమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనీల్ దేశ్ముఖ్..తనపై మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లకు కూడా స్పందించలేదు. దేశ్ముఖ్ విషయంలో సీబీఐ నుండి సహాయం కావాలని ఈడీ కోరింది.
ఇక,నాలుగు వేధింపుల కేసుల్లో పరమ్ బీర్ సింగ్ పై ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్ర పోలీసు చీఫ్ సంజయ్ పాండే ఇటీవల..పరమ్ బీర్ సింగ్ మరియు వేధింపు కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని ప్రతిపాదన పంపారు, అయితే రాష్ట్ర హోం శాఖ మరిన్ని వివరాలను కోరినట్లు సమాచారం.