Revised IT Rules: ఫేస్బుక్, గూగుల్ ఒకే.. నెక్స్ట్ ఏంటీ?
Revised IT rules: కేంద్రం గైడ్లైన్స్పై డిజిటల్ ఫ్లాట్ఫామ్ దిగ్గజాలైన ఫేస్బుక్, గూగుల్ స్పందించాయి. కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి రావడానికి కేవలం కొన్ని గంటల ముందే.. ఈ రెండు పెద్ద సంస్థలు తమ సమ్మతిని తెలిపాయి. డిజిటల్ కంటెంట్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నిబంధనలు అమలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వెల్లడించింది.
అయితే.. కేంద్రం తీసుకొచ్చిన ఐటీ గైడ్లైన్స్లోని కొన్ని సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. డిజిటల్ కంటెంట్లో నైతిక విలువల నియమావళి, ఫిర్యాదుల పరిష్కారం కోసం మూడంచెల వ్యవస్థల ఏర్పాటుపై విధించిన డెడ్లైన్ ముగుస్తుండడంతో ఫేస్బుక్, గూగుల్ స్పందించాయి. అయితే.. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇంకా స్పందించలేదు.
డిజిటల్ కంటెంట్ నియంత్రణ కోసం ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే వీటికి కట్టుబడుతూ సామాజిక మాధ్యమాలు కొన్న ఇంకా చర్యలు చేపట్టలేదు. ఇలా నిబంధనలకు కట్టుబడకుంటే ఈ సంస్థలకున్న ఇంటర్మీడియరీ స్టేటస్ రద్దవుతుందని, క్రిమినల్ చర్యలనూ ఎదుర్కోవాల్సి రావొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో వాటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.