IRCTC : ప్రయాణికులకు శుభవార్త-ఆన్లైన్ టికెట్ బుకింగ్ పరిమితి పెంచిన రైల్వే
తరుచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి.... కుటుంబ సభ్యులతో...బంధుమిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రదేశాలకు గ్రూప్గా వెళ్లే వారికి భారతీయ రైల్వే శుభవార్త అందించింది.
IRCTC : తరుచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి…. కుటుంబ సభ్యులతో…బంధుమిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రదేశాలకు గ్రూప్గా వెళ్లే వారికి భారతీయ రైల్వే శుభవార్త అందించింది. ఆన్లైన్లో టికెట్లు బుకింగ్ చేసుకునే నిబంధనలు సడలించింది. ఇక నుంచి ఆన్లైన్ టికెట్ల బుకింగ్ పరిమితి పెంచుతున్నట్లు ఈరోజు ప్రకటించింది.
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వెబ్సైట్ ద్వారా, దాని యాప్ ద్వారా ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ పరిమితి పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. ఆధార్ లింక్ కాని ఒక యూజర్ ఐడీ ద్వారా నెలలో గరిష్టంగా ప్రయాణ టికెట్ల బుకింగ్ పరిమితి 6 నుంచి 12కు పెంచింది. ఆధార్ లింక్డ్ యూజర్ ఐడీ ద్వారా 12 నుంచి 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు సాధారణ యూజర్ ఐడీ ద్వారా నెలలో ఆరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునేందుకు అనుమతి లభించేది. ఒకవేళ ఏదైనా శుభకార్యానికి కుటుంబం అంతా కలిసి వెళ్లాలన్నా.. పుణ్యక్షేత్రానికి వెళ్లాలన్నా.. అందరికీ టికెట్లు బుక్ చేసుకోవడం అంటే ఒకటి కంటే ఎక్కువ యూజర్ ఐడీలు క్రియేట్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకునేవారు. ఆధార్ లింక్డ్ యూజర్ ఐడీతో 12 నుంచి 24 టికెట్లు బుక్ చేసుకునేందుకు వెసులుబాటు లభించడంతో ఒక్క ఐడీతోనే కుటుంబ సభ్యులందరికి టికెట్లు బుక్ చేసుకోవడానికి వీలు కలిగింది.