Bengaluru Floods: బెంగళూరు వరదలకు కాంగ్రెసే కారణమట.. కర్ణాటక సీఎం బొమ్మై విమర్శలు
పలు ప్రాంతాల్లో కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీరు చేరడంతో ఐటీ కంపెనీలకు దాదాపు రూ.225 కోట్ల నష్టం వాటిల్లింది. సోమవారం పలు సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. బెంగుళూరులో వారంలోనే రెండోసారి కుండపోత వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది
Bengaluru Floods: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం అర్థరాత్రంతా కురిసిన కుండపోతకు నగరం సరస్సులా మారింది. అయితే నగరం ఇలా వరదలో తేలియడడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దుష్పాలన, ప్రణాళిక లేని వ్యవస్థ కారణంగా బెంగళూరు నేడు ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. చెరువులు, కుంటలు అని చూడకుండా అన్నింటిలో నిర్మాణాలకు అనుమతులిచ్చి ఇప్పుడు ప్రజలను బురదలో ముంచారని బొమ్మై మండిపడ్డారు.
నగరంలో చాలా చోట్ల చెరువులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. సిటీ ఎయిర్పోర్టు ప్రవేశద్వారంలో మోకాళ్ల లోతు నీరు చేరింది. రాష్ట్ర సచివాలయం విధానసౌధకూ వర్షం తాకిడి తగిలింది. విధానసౌధలోని గ్రౌండ్ఫ్లోర్లో క్యాంటీన్లోకి నీరు చేరడంతో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హెచ్ఏఎల్లోని పలు విభాగాల్లోకి నీరు చేరడంతో సమస్య తలెత్తింది.
పలు ప్రాంతాల్లో కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీరు చేరడంతో ఐటీ కంపెనీలకు దాదాపు రూ.225 కోట్ల నష్టం వాటిల్లింది. సోమవారం పలు సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. బెంగుళూరులో వారంలోనే రెండోసారి కుండపోత వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సంపంగిరామనగర్లో 148 మిల్లీమీటర్లు, మారతహళ్లి, దొడ్డనెక్కుంది, వర్తూరు, హెచ్ఏఎల్ రోడ్డు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.