మన్ కీ బాత్ : పీవీ సింధు,మిథాలీపై మోడీ ప్రశంసలు
భారత మహిళలు క్రీడలు, శాస్త్రీయ రంగాలతో పాటు ఇతర అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు.
Mann Ki Baat భారత మహిళలు క్రీడలు, శాస్త్రీయ రంగాలతో పాటు ఇతర అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. మన్ కీ బాత్ నేటితో 75 ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రోతలకు మోడీ ధన్యవాదాలు చెప్పారు.
మార్చి 8న ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్నామని, ఇదే నెలలో చాలామంది భారత మహిళా క్రిడాకారిణిలు తమ పేరిట సరికొత్త రికార్డులు నమోదు చేయడం సంతోషకరమని మోడీ అన్నారు. మహిళా క్రికెట్ చరిత్రలో 10 వేల పరుగుల మైలురాయిని దాటిన తొలి భారత క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ నిలిచారని, ఆమె సాధించిన విజయానికి తాను అభినందనలు తెలియజేస్తున్నానని ప్రధాని చెప్పారు. బాడ్మింటన్ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో రజత పతకం సాధించిన పీవీ సింధును మోడీ అభినందించారు.సింధు అద్భుతమైన క్రీడా ప్రదర్శనలతో అనేక అవార్డులు అందుకున్నారని ప్రధాని గుర్తుచేశారు. మిథాలీ, సింధు ఇద్దరూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్లో మహిళలు పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారని, బంగారు పతకాల జాబితాలోనూ భారత్ ముందంజలో ఉన్నదని ప్రధాని తెలిపారు.
గత ఏడాది మార్చిలో కరోనాను కట్టిడి చేసేందుకు విధించిన జనతా కర్ఫ్యూ ఏడాది పూర్తి చేసుకున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. ఈ కర్ఫ్యూ సమయంలో భారతీయులు చూపిన క్రమశిక్షణ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. దీన్ని భవిష్యత్తు తరాలు కూడ గుర్తుంచుకొంటాయన్నారు.
ఇక,ప్రస్తుతం దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కురువృద్ధులు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని ప్రధాని గుర్తుచేశారు. హైదరాబాద్లో జయ్ చౌదరీ అనే వందేండ్ల వృద్ధుడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడని, యూపీలో 109 ఏండ్ల రామ్ దులయ్యా, ఢిల్లీలో 107 ఏండ్ల కేవల్ కృష్ణ కరోనా కరోనా టీకా వేయించుకున్నారని ప్రధాని చెప్పారు